వరంగల్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సీఎం కేసీఆర్ ప్రారంభించిన ‘మన ఊరు- మన బడి’తో తెలంగాణ సర్కారు బడులు దేశానికి ఆదర్శంగా నిలుస్తాయని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టంచేశారు. ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతులు కల్పించి, నాణ్యమైన ఉచిత విద్యను అందించే లక్ష్యంతో సీఎం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. పిల్లల చదువుల కోసం వరంగల్, హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లే పరిస్థితి ఇకపై ఉండదని చెప్పారు. ‘మన ఊరు- మన బడి’ అమలుపై శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్లో వరంగల్, హనుమకొండ జిల్లాల సమీక్షలో మంత్రి దయాకర్రావు మాట్లాడారు. పిల్లల చదువుల కోసం ఎవరూ గ్రామం వీడకుండా సర్కారు బడులను మూడు దశలలో అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. మొదటి దశలో హనుమకొండ జిల్లాలో 176 స్కూళ్లు, వరంగల్ జిల్లాలో 223 స్కూళ్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ప్రతి బడిలో మరుగుదొడ్లు, విద్యుత్తు, మంచినీటి సరఫరా, ఫర్నిచర్, ప్రహరీలు, వంట గది, అదనపు గదుల మరమ్మతులు, డిజిటల్ గదుల వంటి సదుపాయాలు కల్పించేలా ప్రతిపాదనలు సిద్ధంచేయాలని అధికారులను ఆదేశించారు. వనరుల నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో నిధుల నిర్వహణ కోసం ప్రత్యేక ఖాతాను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సర్కారు స్కూళ్లలో చదివిన పూర్వ విద్యార్థులు, దాతలు, ఎన్ఆర్ఐల సహకారం తీసుకోవాలని కోరారు. రూ.7,800 కోట్లతో పాఠశాలలను ఆధునీకరించాలని సీఎం నిర్ణయించారని, వంద శాతం ఫలితాలు వచ్చే దిశలో చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ మాట్లాడుతూ.. కబ్జాలకు గురువుతున్న ప్రభుత్వ స్కూళ్ల స్థలాలకు రక్షణ కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు నర్సిరెడ్డి, బండా ప్రకాశ్, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, నన్నపునేని నరేందర్, పెద్ది సుదర్శన్రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, జడ్పీ చైర్మన్ ఎం సుధీర్కుమార్ పాల్గొన్నారు.