Schools Reopen | గత విద్యా సంవత్సరాన్ని కొవిడ్ చిన్నాభిన్నం చేసింది. కనీసం ప్రస్తుత విద్యా సంవత్సరంలోనైనా విద్యాసంస్థలు ప్రారంభం అవుతాయని అనుకుంటే సెకండ్ వేవ్ మూడు నెలల పాటు విద్యార్థులకు విద్యను దూరం చేసింది. అయితే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కఠిన చర్యలతో రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. దీంతో పిల్లల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని సెప్టెంబర్ 1 నుంచి విద్యా సంస్థలను తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని హితవు పలికింది. దీంతో విద్యాసంస్థలు కొవిడ్ జాగ్రత్తలపై దృష్టిసారించాయి.
ఆన్లైన్ తరగతులతో కొంతవరకు సత్ఫలితాలు వచ్చినా ఆ విధానాన్ని కొనసాగించడం అటు విద్యాసంస్థలు, ఇటు విద్యార్థుల తల్లిదండ్రులకు కష్టంగా మారింది. తాజాగా ప్రభుత్వం విద్యాసంస్థలను తెరుచుకోవడానికి గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, యాజమాన్యాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్థుల ఆరోగాన్ని కాపాడుతూనే బోధన సాగించేందుకు సంసిద్ధమవుతున్నాయి.
విలువైన కాలేజీ లైఫ్ ఇంట్లోనే ముగుస్తుందా అని భయపడ్డా. స్కూళ్లు, కాలేజీలు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం సంతోషంగా ఉంది. ఆన్లైన్లో చదువులు సాగుతున్నా స్నేహితులు లేరనే బాధ మాత్రం ఉంది. మా లెక్చరర్లతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఇప్పటి వరకు రాలేదు. సెప్టెంబర్ 1 నుంచి కాలేజీ వెళ్తా. భద్రంగా ఉంటూ విద్యను అభ్యసిస్తా.
-విజ్నశ్రీ, విద్యార్థి
ఇంట్లోనే పిల్లలు ఎక్కువ రోజులు ఉండటంతో ఒత్తిడికి గురవుతున్నారు. టీచర్లు, స్నేహితులను కలిసే అవకాశం లేకపోవడంతో వారి మానసిక ఎదుగుదలకు కొంత నష్టం కలుగుతుంది. పాఠశాలలు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించడం గొప్ప విషయం. ఈ విషయాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. విద్యాసంస్థలు తెరిస్తే విద్యార్థులకు కొంత లాభం కలుగుతుంది.
– నిర్మల, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు
ఆన్లైన్ చదువులతో పిల్లలు ఏం నేర్చుకుంటున్నారో అర్థం కావడం లేదు. యూట్యూబ్లో పాఠాలు వినిడం మేలు అనిపిస్తున్నది. టీచర్లు చెప్పే అనేక విషయాలు పిల్లలకు అర్థం కావడం లేదు. ఈ సంవత్సరం మూడు నెలలు బడులు తెరవలేదు. స్కూళ్లు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం అభినందనీయం. బడిలోనే అనేక విషయాలు నేర్చుకునేందుకు పిల్లలు ఉత్సాహం చూపుతారనడంలో సంశయం లేదు.
– పల్లవి
థర్డ్వేవ్ ముప్పు ఉందని నిపుణులు చెబుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో స్కూళ్లు తెరవడం కొంత ఇబ్బందికరమే. పిల్లల చదువుతో పాటు వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవడం ప్రస్తుతం అత్యవసరం. ఆన్లైన్ చదువులతో ఉపయోగం లేకున్నా.. ప్రత్యక్ష విద్యాబోధన కోసం పాఠశాలలకు పంపాలంటే ఆలోచించాల్సి వస్తుంది. విద్యాసంస్థలు తీసుకునే జాగ్రత్తలను బట్టి పిల్లలను స్కూల్కు పంపాలా వద్దా నిర్ణయించుకుంటా.
– చంద్రవదన
పిల్లలు ఇంట్లో ఏం చదువుతున్నారో పర్యవేక్షించలేకపోతున్నాం. వారి సందేహాలు నివృత్తి చేయడం కొంత కష్టమే. నెట్వర్క్, విద్యుత్, డేటా సమస్యతో క్లాసులు అనుకున్న స్థాయిలో జరగడం లేదు. చాలా మంది విద్యార్థులు క్లాస్ సమయానికి వీడియో ఆన్ చేయడం లేదు. వారు ఏం చేస్తున్నారో కూడా లెక్చరర్లు పర్యవేక్షించలేకపోతున్నారు. ఆన్లైన్లో రాసే పరీక్షల ఆధారంగా వచ్చే మార్కులతో విద్యార్థులు బాగా చదువుతున్నారని అనుకోలేము. తరగతి గదిలోనే ప్రత్యక్షంగా పాఠాలను వినడమే విద్యార్థులకు ఉత్తమం.
– అపర్ణ, చైతన్య కాలేజీ ప్రిన్సిపాల్
చాలా రోజులుగా పిల్లలు ఇంట్లోనే ఉంటుండటంతో బయటి సమాజంపై అవగాహన ఉండటం లేదు. స్కూల్లో టీచర్లు, స్నేహితులను చూసి ఎంతో కొంత నేర్చుకుంటారు. జ్ఞానాన్ని పెంచుకుంటారు. వచ్చే నెల 1 నుంచి స్కూళ్లను తెరవడం మంచి నిర్ణయమే. ప్రతి పాఠశాల యాజమాన్యం కొవిడ్ నిబంధనలను పాటించాలి.
– స్నేహలత