హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థల సెలవులను ఈ నెల 30 వరకు పొడిగించింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదేశాల మేరకు ఈ చర్య చేపట్టినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ప్రకటించారు. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. వైద్య కళాశాలలు మినహా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ విద్యాసంస్థలన్నింటికీ సెలవులు ఇస్తున్నట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మెడికల్ కళాశాలలు మాత్రం యథావిధిగా నడుస్తాయని స్పష్టం చేశారు.
గురుకులాలకూ సెలవు
కరోనా నేపథ్యంలో గురుకులాలకు సైతం ఈ నెల 30 వరకు సెలవులను పొడిగిస్తున్నట్టు మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ వెల్ఫేర్ గురుకుల విద్యాలయాల సొసైటీ కార్యదర్శి మల్లయ్య భట్టు ప్రకటించారు. ఈ ప్రకటనకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని ఆర్సీవోలు, ప్రిన్సిపాళ్లు, స్పెషల్ ఆఫీసర్లను ఆదేశించారు.
నేటి నుంచి ఓయూ, జేఎన్టీయూలో ఆన్లైన్ క్లాసులు
విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులను పొడిగించడంతో సోమవారం నుంచి ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని జేఎన్టీయూ, ఉస్మానియా వర్సిటీ నిర్ణయించాయి. ఓయూ క్యాంపస్తోపాటు వర్సిటీ పరిధిలోని అన్ని కళాశాలల యూజీ, పీజీ విద్యార్థులందరికీ ఈ నెల 30 వరకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని ఓయూ రిజిస్ట్రార్ ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. అలాగే జేఎన్టీయూ హైదరాబాద్ పరిధిలోని అన్ని కాలేజీలు, అనుబంధ కళాశాలల్లో ఇంజనీరింగ్, ఫార్మా, ఆర్క్టెక్ట్ కోర్సులను అభ్యసిస్తున్న యూజీ, పీజీ విద్యార్థులతోపాటు ఎంబీఏ, ఎంసీఏ విద్యార్థులకు ఈ నెల 22 వరకు ఆన్లైన్లో క్లాసులు నిర్వహించాలని ఆ వర్సిటీ ఆదేశించింది.
పాలిటెక్నిక్ సెమిస్టర్ పరీక్షలు వాయిదా
ఈ నెల 18 నుంచి జరగాల్సిన పాలిటెక్నిక్ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ఎస్బీటీఈటీ టీఎస్ కార్యదర్శి వెల్లడించారు. ఈ పరీక్షలను ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని తెలిపారు.