హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): ఆహారధాన్యాల ఉత్పత్తిలో రాష్ట్రం రికార్డులు తిరగరాసిందని మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. జాతీయ రైతుల దినోత్సవం సందర్భంగా గురువారం ఆయన రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయరంగంలో అద్వితీయ ప్రగతి సాధించినట్టు వివరించారు. కానీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ సహాయ నిరాకరణ రైతులకు ఇబ్బందికరంగా మారిందని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో స్పష్టమైన విధానం ప్రకటించాలని, రైతులను ఇబ్బందిపెట్టవద్దని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం అనేకసార్లు విజ్ఞప్తి చేసిందని గుర్తుచేశారు. రైతులు బాగుంటేనే రాష్ట్రం, దేశం బాగుంటాయని అన్నారు.
తెలంగాణ రాక ముందు వ్యవసాయం ఎట్లా ఉన్నది? రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతుల పరిస్థితి ఏ విధంగా మారింది? ఏడేండ్లలో వ్యవసాయ రంగానికి సంబంధించి తెలంగాణలో ఏం జరిగింది? ధాన్యం కొనుగోళ్లలో ఎవరి పాత్ర ఎంత? ధాన్యం సేకరణలో ప్రస్తుతం సమస్య ఎందుకొచ్చింది? కేంద్రం వాదనలో నిజమెంత? అనే విషయాలను వివరిస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. పంజాబ్ తరహాలో తెలంగాణలో పండిన మొత్తం ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఆయన రైతులకు శుభాకాంక్షలు తెలిపారు.
రైతులకు 2 లక్షల కోట్లు ఇస్తే నష్టమేమిటి?: షేత్కరీ సంఘటన్ నేత విజయ్ జావాండియా
రైతులు పండించిన పంటలకు మద్దతు ధర ఇస్తే రూ.2 లక్షల కోట్ల భారం పడుతుందని కేంద్రం భావిస్తున్నదని షేత్కరీ సంఘటన్ వ్యవస్థాపక సభ్యుడు, రైతు ఉద్యమ నాయకుడు విజయ్ జావాండియా విమర్శించారు. రైతుల కోసం రూ.2 లక్షల కోట్లు ఇస్తే నష్టమేమిటని కేంద్రాన్ని ప్రశ్నించారు. గురువారం జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా మాజీ ప్రధాని చరణ్సింగ్ను స్మరించుకుంటూ హైదరాబాద్లోని తార్నాకలో ‘రైతులు, చట్టాలు-న్యాయసేవలు’ అనే అంశంపై సదస్సులో విజయ్ జావాండియా వర్చువల్గా పాల్గొని మాట్లాడుతూ.. రైతులకు రోజువారీ ఆదాయం రూ.150 నుంచి రూ.200 కూడా రావడం లేదన్నారు.
ప్రపంచ ఒప్పందాలు వ్యవసాయంపై ప్రభావం పడకుండా దృష్టి పెట్టాలని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది నిరూప్రెడ్డి పేర్కొన్నారు. కార్పొరేట్ కుట్రలనుంచి రైతులను రక్షించాలని ప్రొఫెసర్ డీ నరసింహారెడ్డి పిలుపునిచ్చారు. రైతులు ఒక కన్ను నాగలిపై, మరో కన్ను చట్టంపై వేసి ఉంచాలని భూ చట్టాల నిపుణుడు, నల్సార్ వర్సిటీ అనుబంధ ఆచార్యుడు సునీల్ పిలుపునిచ్చారు.