సిటీబ్యూరో, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): ప్రజలకు మరింత మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా పనిచేస్తామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. అందులో భాగంగానే ఇకనుంచి ఠాణాలను ఏ క్షణంలోనైనా ఆకస్మికంగా తనిఖీ చేస్తానని వెల్లడించారు. హైదరాబాద్ సీపీగా బాధ్యతలు చేపట్టిన ఆయన బుధవారం ఆకస్మికంగా పంజాగుట్ట పీఎస్ను తనిఖీ చేశారు. రెండు గంటలకు పైగా ఆయన పోలీస్ స్టేషన్లోని అన్ని విభాగాలను పరిశీలించి, సిబ్బందితో మాట్లాడారు. స్టేషన్కు వచ్చిన ఫిర్యాదుదారులతో మాట్లాడి పోలీసు సేవలపై ఆరా తీశారు. స్టేషన్లోని అన్ని విభాగాలను, పార్కింగ్ ఏర్పాట్లను కూడా పరిశీలించారు. పీఎస్లోని పనులను 17 విభాగాలుగా విభజించి సిబ్బందికి ఆయా బాధ్యతలను అప్పగించారు. కేసులు నమోదు, దర్యాప్తు, విచారణ, పెండింగ్పై ఆరా తీసి, పలు సూచనలు చేశారు.
దేశంలోనే బెస్ట్ మోడల్ పీఎస్..
2017లో దేశంలోనే బెస్ట్మోడల్ పోలీస్స్టేషన్గా పంజాగుట్ట పీఎస్ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిందని సీపీ గుర్తు చేశారు. పోలీసుల పనితీరును తెలుసుకోవడానికి ఆకస్మిక తనిఖీ చేశానన్నారు. ప్రభుత్వం అన్ని సౌకర్యాలతో పీఎస్ భవనాన్ని నిర్మించిందన్నారు. పోలీసులపై పనిభారం ఎక్కువగా ఉన్నదని, అయినా పనితీరు బాగుందన్నారు. పంజాగుట్టలో సుమారు 600 కేసులు నమోదుకాగా.. 175 కేసులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయన్నారు. విజిటర్స్ హెల్ప్ డెస్క్ చాలా బాగా పనిచేస్తుందని సంతృప్తిని వ్యక్తం చేశారు.
ట్రాఫిక్పై మరింత దృష్టి..
నగరంలో ట్రాఫిక్ సమస్యపై మరింత దృష్టి పెడుతామని సీపీ తెలిపారు. ప్రజలు ఇబ్బంది పడకుండా హోంగార్డు నుంచి ఉన్నతాధికారుల వరకు ట్రాఫిక్ సమస్య రాకుండా కృషి చేస్తామన్నారు. తాను గతంలో ట్రాఫిక్ అదనపు సీపీగా పనిచేసిన సమయంలో రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు పలు రకాలైన చర్యలు తీసుకున్నానని తెలిపారు. ఆ అనుభవంతో మరింత పటిష్టంగా ట్రాఫిక్ మేనేజ్మెంట్ను నిర్వహిస్తామని వెల్లడించారు. పాతబస్తీ లాంటి ప్రాంతాల్లో ఒకే రకమైన రోడ్లు అందుబాటులో లేవన్నారు. ఒక దగ్గర నాలుగులైన్లు ఉంటే కొద్ది దూరం వెళ్లగానే రెండు లైన్లుగా రహదారులు మారాయన్నారు. ఇలాంటి మార్గాలు ఇబ్బంది పెడుతాయన్నారు. సీపీ వెంట జాయింట్ సీపీ ఏఆర్ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ నిరంజన్రెడ్డి తదితరులు ఉన్నారు.