కవాడిగూడ, డిసెంబర్ 30: మాలలకు అన్యాయం చేస్తూ ఎస్సీల మధ్య చిచ్చుపెడుతున్న కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి, ఆయనకు మద్దతునిస్తున్న టీపీసీసీ ఛీప్, ఎంపీ రేవంత్ రెడ్డిలకు రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెపుతామని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కన్వీనర్ జంగా శ్రీనివాస్ హెచ్చరించారు. ఈ మేరకు గురువారం ఇందిరా పార్కు చౌరస్తాలో ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, ఎంపీ, టీ పీసీసీ ఛీప్ రేవంత్రెడ్డిల ప్లెక్సీలను దహనం చేశారు. వర్గీకరణ వద్దు అని పెద్ద ఎత్తున నినాదాలు చేసి చెప్పులతో కొడుతూ ఫ్లెక్సీలను దహనం చేశారు. ఈ సందర్భంగా జంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఆర్టీకల్ 340 ప్రకారం, సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించాలని, ఉషా మెహరా కమిషన్ ఇచ్చిన నివేదికకు వ్యతిరేకంగా పనిచేస్తే రానున్న రోజుల్లో గల్లీ నుంచి ఢిల్లీ వరకు పెద్ద ఎత్తున ఆందోళనను కొనసాగిస్తామని ఆయన హెచ్చరించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితులకు గొప్ప పథకాలను అందిస్తుంటే బీజేపీ, కాంగ్రెస్లు రాజ్యాంగంలోని లేని వర్గీకరణను సమర్ధిస్తూ దళితుల ఐక్యతను దెబ్బతీస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల ఐక్యతను దెబ్బతీసేలా ఎస్సీ వర్గీకరణను సమర్ధిస్తూ మాట్లాడటం కిషన్రెడ్డి, రేవంత్రెడ్డిలకు తగదని ఆయన అన్నారు. మాదిగ సామాజిక వర్గానికి సపోర్టుగా అమిత్ షాకు కిషన్రెడ్డి, రేవంత్రెడ్డిలు దొంగచాటుగా లేఖలు రాయడం సిగ్గుచేటని, ఇలాంటి దుర్మార్గమైన చర్యలను మానుకోవాలని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సమితి నాయకులు మల్లేష్, జే.స్వామిరాజ్, ఎం.ప్రభాకర్, బల్వన్, బాలకృష్ణ, జీడీ ఉమేష్, సుబ్బారావు, విజయ్, బబ్లూ, రాజు, నరేందర్ పాల్గొన్నారు.