న్యూఢిల్లీ, నవంబర్ 30: ప్రతిపక్షాలకు చెందిన 12 మంది ఎంపీల సస్పెన్షన్పై మంగళవారం పార్లమెంటు ఉభయ సభలు దద్దరిల్లాయి. ప్రభుత్వం, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇద్దరూ ఒకరినొకరు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసుకున్నారు. ఆగస్టులో పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా అనుచితంగా ప్రవర్తించారంటూ 12 మంది విపక్ష రాజ్యసభ సభ్యులపై శీతాకాల సమావేశాల తొలిరోజు సోమవారం సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. మంగళవారం సభ ప్రారంభం కాగానే సస్పెన్షన్ను రద్దు చేయాలని ప్రతిపక్ష నాయకుడు మల్లిఖార్జున్ ఖర్గే విజ్ఞప్తి చేశారు. దాన్ని రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్యనాయుడు తిరస్కరించారు. పార్లమెంటును అపవిత్రం చేసినందుకు ఆ ఎంపీలకు పశ్చాత్తాపం కూడా లేదని వ్యాఖ్యానించారు. ‘ససెన్షన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం, ఆమోదించడం, చర్య తీసుకోవడం పూర్తయింది. అదే ఫైనల్’ అని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా, ఏకపక్షంగా ఎంపీలను సస్పెండ్ చేశారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. సస్పెన్షన్ను నిరసిస్తూ రాజ్యసభతో పాటు లోక్సభ నుంచి కూడా కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాల సభ్యులు వాకౌట్ చేశారు. అనంతరం పార్లమెంటు కాంప్లెక్స్లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద బైఠాయించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సస్పెండ్ అయిన ఎంపీలు బుధవారం నుంచి గాంధీజీ విగ్రహం వద్ద నిరసన తెలియజేస్తారని తెలిపారు.