హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): శాసనమండలి ఎన్నికల ప్రక్రియలో మంగళవారం అరుదైన సన్నివేశం చోటుచేసుకోనున్నది. ఎమ్మెల్యే కోటాలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ గడువు ముగుస్తుండగా, స్థానిక సంస్థల కోటాలోని 12 ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతున్నది. దీనిని అరుదైన సందర్భంగా అసెంబ్లీ వర్గాలు వర్ణిస్తున్నాయి. ఎమ్మెల్యే కోటాలో బరిలోకి దిగనున్న టీఆర్ఎస్ అభ్యర్థులు మంగళవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్లో నిర్వహించే సమావేశం ముగిసిన అనంతరం అభ్యర్థులు, వారిని బలపరిచే ఎమ్మెల్యేలు జట్టుగా వెళ్లి, నామినేషన్ దాఖలు చేస్తారని సమాచారం.