హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్స్లకు దరఖాస్తు గడువు గురువారంతో ముగియనున్నది. రాష్ట్రవ్యాప్తంగా 2,620 దుకాణాలకు లైసెన్సులు జారీచేసేందుకు ఈ నెల 9 నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలైన విషయం తెలిసిందే. బుధవారం సాయంత్రం వరకు మొత్తం 23,700 దరఖాస్తులు వచ్చినట్టు సమాచారం. బుధవారం ఒక్కరోజే 8,949 దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తున్నది. దీని ప్రకారం ఇప్పటివరకు ఒక్కో దుకాణ లైసెన్సు కోసం సగటున 9 దరఖాస్తులు అందాయి. గురువారం చివరి రోజు కావడంతో వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది.
ఇప్పటివరకు ఖమ్మం డివిజన్లో అత్యధికంగా 210 దుకాణాలకు 4,678 దరఖాస్తులు అందాయి. ఏపీ-తెలంగాణ సరిహద్దు ప్రాంతం కావడంతోనే తీవ్రమైన పోటీ నెలకొన్నట్టు భావిస్తున్నారు. రంగారెడ్డి, హైదరాబాద్ డివిజన్లు వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. రంగారెడ్డి డివిజన్లోని 495 దుకాణాలకు 4,633 దరఖాస్తులు, హైదరాబాద్ డివిజన్లోని 179 దుకాణాలకు 1,366 దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 20న లక్కీడ్రా నిర్వహించి లైసెన్స్దారులను ఎంపిక చేయనున్నారు. డిసెంబర్ 1 నుంచి రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ అమల్లోకి రానున్నది.