కవాడిగూడ : అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందుందని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. గత 70 ఏళ్లుగా ఎలాంటి అభివృద్ధికి నోచుకోని తెలంగాణ రాష్ట్రం నేడు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే బంగారు తెలంగాణగా రూపుదిద్దుకుంటుందని, ఆందుకు సీఎం కేసీఆర్ అహర్నిషలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎడ్ల హరిబాబు యాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ భోలక్పూర్ డివిజన్లోని బడే మసీదు వద్ద అజ్మీరా దర్గాకు సమర్పించే ఛాదర్ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
అనంతరం హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ తెలంగాణ గంగా జమున తెహజీబ్ అని అన్నారు. హిందూ ముస్లింలు అందరూ కలిసి మెలసి ఉంటారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతనే రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు. విద్య, వైద్యంతో పాటు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, రైతు బంధు, రైతు భీమా, దళిత బంధుతో పాటు అన్ని కులాలకు సముచిత న్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రజలు సుఖ శాంతులతో ఉండాలని కోరుతూ టీఆర్ఎస్ నాయకుడు ఎడ్ల హరిబాబు ప్రతి ఏటా అజ్మీరా దర్గాకు ఛాదర్ సమర్పించడం అభినందనీయం అన్నారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ అన్ని వర్గాలు ఆయురారో గ్యాలతో ఉండాలని కోరుతూ అజ్మీరా దర్గాకు ప్రతి ఏటా ఎడ్ల హరిబాబు యాదవ్ 110 మందితో కలిసి అజ్మీరా దర్గాకు వెళ్లి ఛాదర్ సమర్పించడం సంతోషకరమన్నారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఎండీ షరీఫుద్ధీన్, భోలక్పూర్ కార్పొరేటర్ గౌసుద్ధీన్, టీఆర్ఎస్ యువజన విభాగం నాయకుడు ముఠా జైసింహ, భోలక్పూర్ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ బింగి నవీన్ కుమార్, భోలక్పూర్ అధ్యక్ష కార్యదర్శులు మహ్మద్ అలీ, ఎ.శంకర్ గౌడ్, ముషీరాబాద్ అధ్యక్షుడు సయ్యద్ భక్తియార్, సీనియర్ నాయకులు జునేద్ బాగ్ధాది, మున్వర్ చాంద్, అనీఖ్, వరుణ్ యాదవ్, ఇమ్రాన్ బాగ్ధాది, ఖలీల్, జబ్బార్, ఆరిఫుద్దీన్, కెఎం. సాయి, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.