మాదాపూర్, నవంబర్ 19: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విధి విధానాలు నచ్చడంతో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పలు విదేశీ, స్వదేశీ సంస్థలు, కంపెనీలు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నాయని, రాష్ట్రంలో ఎలక్ట్రిక్, సోలార్ సంస్థల అభివృద్ధి జరుగుతున్నట్లు రెన్యూవబుల్ ఎనర్జీ డైరెక్టర్ జనరల్ అజయ్ మిశ్రా పేర్కొన్నారు. మాదాపూర్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో శుక్రవారం ఏర్పాటు చేసిన రెన్యూ ఎక్స్ ట్రేడ్ ఎక్స్ పో కార్యక్రమానికి సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రఘుమారెడ్డి, హైదరాబాద్ బ్రిటీష్ డిప్యూటీ హై కమీషనర్, డాక్టర్ ఆండ్య్రూ ఫ్లెమింగ్, పీడబ్ల్యూసీ డైరెక్టర్ (పవర్ అండ్ యుటిలిటీస్) భాగ్యతేజ్, ఇన్ఫార్మా మార్కెట్స్ ఇన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ యోగేష్ ముద్రాస్, ఇన్ఫార్మా మార్కెట్స్ ఇన్ ఇండియా గ్రూప్ డైరెక్టర్ ఎనర్జీ పోర్ట్ పోలియో రజనీష్ కతార్లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అజయ్ మిశ్రా మాట్లాడుతూ..తెలంగాణలో గో ఎలక్ట్రిక్ విధానంతో అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నట్లు చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగదారులను ప్రోత్సహిస్తూ సబ్సిడీ అందజేస్తున్నట్లు తెలిపారు. సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రఘుమారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో నాన్కన్వెన్షన్ సోలార్, సోలార్ రూఫ్ల వినియోగం 60శాతం పెరుగుతుందని, 300 బిలియన్ల డాలర్లతో రాష్ట్రంలో నూతన ఆవిష్కరణలు ప్రవేశపెడుతుందని, దీంతో తెలంగాణ ఉపాధి కల్పనలో అతిపెద్ద రాష్ట్రంగా అవతరిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో పలు కంపెనీలకు చెందిన ప్రతినిధులు వారి ఉత్పత్తులను ప్రదర్శించారు. రెండు రోజులపాటు జరుగనున్న ఈ ప్రదర్శనలో హై బ్రిడ్ సిస్టమ్స్, ఈపీసీ కంపెనీలు, పీవీ మాడ్యూల్స్, తయారీసంస్థలు, మెటీరియల్స్అండ్ ఎక్విప్మెంట్స్, ఇన్వర్టర్లు, చార్జ్ కంట్రోలర్లు, బ్యాటరీలు, టెస్టింగ్ అండ్ మానిటరింగ్ సిస్టమ్స్, కంపోనెంట్ తయారీదారులు, బయో ఎనర్జీ ఉపకరణాల తయారీ సంస్థలు పాల్గొన్నాయి.