హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): కృష్ణా బేసిన్లో నీటి కొరత నేపథ్యంలో దీర్ఘకాలిక వంగడాలు పండించటం శ్రేయస్కరం కాదని, స్వల్పకాలికాల ద్వారా నీటిని సద్వినియోగం చేసుకోవచ్చని తెలంగాణ అభిప్రాయపడింది. తద్వారా కృష్ణా బేసిన్లో ఆంధ్రప్రదేశ్ తన నీటి అవసరాన్ని తగ్గించుకొని, కొరత ఉన్న ప్రాంతాలకు ఆ నీటిని వినియోగించవచ్చని తెలిపింది. సోమవారం న్యూఢిల్లీలో బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ ప్రారంభమైంది. తెలంగాణ తరఫున సాక్షిగా హాజరైన కే పళనిస్వామిని ఏపీ తరఫున సీనియర్ న్యాయవాది ఆర్ వెంకటరమణి క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఈ సందర్భంగా కృష్ణా బేసిన్లో తక్కువ కాలంలో చేతికొచ్చే పంటలు పండించటానికి అనుకూలత ఉన్నదని పళనిస్వామి తెలిపారు. ట్రిబ్యునల్లో పళనిస్వామిని మరో మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ తరఫు న్యాయవాది క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు.