హైదరాబాద్, జనవరి 18 : ఉద్యోగుల విభజన, కొత్త జిల్లాలకు ఉద్యోగుల కేటాయింపు నిమిత్తం జారీచేసిన జీవో 317ను సవాల్ చేసిన వ్యాజ్యాల్లో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ జీవో అమలును నిలిపివేయాలన్న పిటిషనర్ల విన్నపాన్ని తోసిపుచ్చింది. ఉద్యోగుల కేటాయింపుల్లో మధ్యంతర ఉత్తర్వులు జారీచేయబోమని గతంలోనే చెప్పామని గుర్తుచేసింది. హైకోర్టు వెలువరించే తుది తీర్పునకు లోబడి జీవో 317 అమలయ్యేలా ఉత్తర్వులు జారీచేయాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని మాత్రం హైకోర్టు ఆమోదించింది. జీవో 317ను సవాల్ చేస్తూ దాదాపు 400 మంది ఉపాధ్యాయులు దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్చంద్రశర్మ, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలితో కూడిన ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపింది. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ జే రామచందర్రావు వాదన వినిపిస్తూ.. ఇప్పటికే పలువురు ఉద్యోగులు విధుల్లో చేరారని చెప్పారు. వీరిలో కొంతమంది పిటిషనర్లు కూడా ఉన్నారని, అయినప్పటికీ వారి తరఫు న్యాయవాదులు కోర్టు నుంచి ఉత్తర్వులను కోరుతున్నారని పేర్కొంటూ.. మధ్యంతర స్టే ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపారు. దీనిపై పిటిషనర్ల తరఫు న్యాయవాదులు స్పందిస్తూ.. జీవో 317 అమలు హైకోర్టు తుది తీర్పుకు లోబడి ఉండేలా ఉత్తర్వులు జారీచేయాలని కోరారు. దీంతో ఉద్యోగుల బదిలీలన్నీ తుది తీర్పునకు లోబడే ఉంటాయని హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. ఉద్యోగుల్లో ఎవరికైనా వ్యక్తిగత సమస్యలుంటే విడిగా వ్యాజ్యాలు దాఖలు చేసుకునే హకు, స్వేచ్ఛ ఉందని స్పష్టం చేసింది. ఈ కేసులన్నింటిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించి, తదుపరి విచారణను ఏప్రిల్ 4కు వాయిదా వేసింది.