హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ్ కాలేజీల్లో మొదటి సంవత్సరంలో అడ్మిషన్ తీసుకునే విద్యార్థులకు ప్రభుత్వం ఇటీవల జారీచేసిన జీవోలు 8, 9 ప్రకారమే ఫీజు చెల్లింపులు ఉంటాయని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. అడ్మిషన్ల సమయంలో సొమ్ము చెల్లించాలని పట్టుబట్టకుండా విద్యార్థుల ఖాతాల ద్వారానే ఫీజులు వసూలు చేసుకోవాలని పేరొంది. మొదటి విడత కౌన్సెలింగ్ పూర్తయిన వెంటనే జూలై 31లోగా విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటే ఆగస్టు 15లోగా వారి ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు గతంలో ఇచ్చిన మధ్యంతర స్టే ఉత్తర్వులను సవరించింది.
ఇటీవల జారీచేసిన జీవో 8, 9లోని నాలుగు మార్గదర్శకాలపై ఇచ్చిన స్టే ఉత్తర్వులను తాతాలికంగా ఎత్తివేసింది. ఇప్పటికే రెండు, మూడు, నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఫీజుల చెల్లింపునకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ నెల 13లోగా విద్యార్థుల వివరాలను ప్రభుత్వానికి సమర్పించాలని, వివరాలు అందిన వెంటనే ఏవైనా అభ్యంతరాలుంటే స్పష్టత తీసుకున్నాక 14 రోజుల్లో వారి ఖాతాలో జమ చేస్తామని ప్రభుత్వం చెప్పడంతో హైకోర్టు అనుమతిస్తూ విచారణను ఆగస్టు 20కి వాయిదా వేసింది.
దీర్ఘకాలం పెండింగ్ ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించకపోవడంతోపాటు, ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఫీజుల వసూలుకు సంబంధించి ప్రభుత్వం జారీచేసిన జీవోలను సవాలు చేస్తూ పలు కాలేజీలు పిటిషన్లు దాఖలు చేశాయి. విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేసుకోవాలన్న మధ్యంతర ఉత్తర్వులను సవరించాలంటూ ప్రభుత్వం పిటిషన్ దాఖలుచేసింది. వీటన్నింటిపై జస్టిస్ జువ్వాడి శ్రీదేవి గురువారం ఉదయం నుంచి సాయంత్రం దాకా సుదీర్ఘంగా విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించడంలేదని అన్నారు.
అటు కాలేజీలు, ఇటు విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నదని ఆరోపించారు. ఫీజు చెల్లిస్తామన్న హామీ అమలుపై సందేహాలున్నాయని తెలిపారు. 2020 నాటి బకాయిలను ఇప్పటిదాకా చెల్లించలేదని, విద్యార్థులు కూడా చదువులు ముగించుకొని వెళ్లిపోయారని అన్నారు. ఫీజు బకాయిలు రాకపోవడంతో కాలేజీల నిర్వహణతోపాటు జీతాలు చెల్లించడానికి ఇబ్బందిగా ఉందని తెలిపారు.
విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేసుకోవచ్చంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వగా వాటిని నీరుగార్చేలా ప్రభుత్వం జీవో 8, 9 తీసుకువచ్చిందని అన్నారు. ఇది కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించేలా ఉందని తెలిపారు. ఆగస్టు 27వ తేదీ వరకు చివరి అడ్మిషన్లకు అవకాశం ఉందని, ఆగస్టు 15లోగా విద్యార్థులు ఫీజులు చెల్లిస్తే కాలేజీల్లో చేరవచ్చని చెప్పారు. అప్పటివరకు మధ్యంతర ఉత్తర్వులను కొనసాగించాలని కోరారు.
ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఫీజు మొత్తాలను విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పారు. మొదటి విడత కౌన్సెలింగ్ పూర్తయిన ఈ నెల 31లోగా దరఖాస్తు చేసుకుంటే 15 రోజుల్లో అనగా ఆగస్టు 15లోగా విద్యార్థుల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. విద్యార్థుల ఖాతాలో జమ అయిన మొత్తాలను వారంలోగా కాలేజీలకు చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. మిగిలిన విడతల్లో కౌన్సెలింగ్ పూర్తయిన వెంటనే దరఖాస్తు చేసుకోవాలని, ఆ తరువాత విద్యార్థుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు.
మొదటి సంవత్సరం విద్యార్థులతోపాటు ప్రస్తుతం చదువుతున్న విద్యార్థుల ఫీజులను చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇస్తున్నదని తెలిపారు. వాదనలను విన్న న్యాయమూర్తి ఫీజుల చెల్లింపునకు ప్రభుత్వ హామీ నేపథ్యంలో 2026- 27 విద్యా సంవత్సరానికి విద్యార్థుల నుంచి ఫీజు వసూలుకు పట్టుబట్టకుండా అడ్మిషన్లు ఇవ్వాలని ఆదేశించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోల ప్రకారమే ఫీజులు వసూలు చేసుకోవాలని ఆదేశించారు. తదుపరి విచారణను ఆగస్టు 20కి వాయిదా వేశారు.