కరోనా కాలానికి ముందు జాతీయస్థాయిలో జరిగిన పలు సర్వేలతో పాటు ‘నేషనల్ అచీవ్మెంట్’ సర్వే విద్యార్థులకు కనీస సామర్థ్యాలు లేవని తేల్చడంతో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. చదవడం, రాయడంతో పాటు సాధారణ లెక్కలు సైతం చేయలేని దయనీయ స్థితిలో విద్యార్థులున్నట్లు ఆ సర్వేలు పేర్కొన్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించాయి. విద్యార్థుల్లో నిర్దేశించిన కనీస సామర్థ్యాలను, అభ్యసన ఫలితాలు సాధించే విధంగా ప్రణాళికను రూపొందించాయి. అంతేకాకుండా విద్యార్థులు పొందిన సామర్థ్యాలను ఎప్పటికప్పుడు మూల్యాంకనం చేసేలా కొత్త ప్రయోగానికి పూనుకున్నాయి.
‘జాతీయ విద్యా విధానం-2020’లో ప్రాథమిక స్థాయి పిల్లల్లో గట్టి పునాది వేయాలనే ఆశయంతో ‘నిపుణ్ భారత్’ కార్యక్రమం ప్రారంభమైంది. ఇందులో భాగంగానే ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ పేరుతో సామర్థ్యాలను పెంచాలనే సంకల్పంతో జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి పూనుకున్నది. దీని ఆధ్వర్యంలో అభ్యసన ఫలితాలు రాబట్టడానికి ప్రణాళికలు రూపొందించారు. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల్లో మౌలిక భాషా సామర్థ్యాల సాధనకు ‘తొలిమెట్టు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
చదవడం, రాయడంతో పాటు అంక గణితంలో సాధారణ లెక్కలకు సంబంధించిన సామర్థ్యాలను విద్యార్థుల్లో పెంపొందించే ఉద్దేశంతో ‘తొలిమెట్టు’ కార్యక్రమాన్ని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి రూపొందించింది. గతంలో పూర్వతరగతి సామర్థ్యాలపై పూర్తి పట్టు సాధించలేకపోయినా కొత్త ఏడాదికి బోధన సాగించేవారు. ఇప్పుడు దానికి భిన్నంగా సామర్థ్యాల సాధన, మదింపు చేపట్టనున్నారు. 220 పని దినాల్లో 140 రోజులు ‘తొలిమెట్టు’ ప్రణాళికను అమలు చేయనున్నారు. వారానికి ఆరు రోజుల పని దినాలలో ఐదు రోజులు బోధనాభ్యసన ప్రక్రియలు చేపట్టి, చివరి రోజు మూల్యాంకనం చేపడతారు. పిల్లల స్థాయిని గుర్తించి కనీస సామర్థ్యాల సాధనతో ప్రారంభించి తరగతికి చెందిన సామర్థ్యాల అభ్యసన ఫలితాలు సాధిస్తారు. తరగతి పెరిగే కొద్దీ సామర్థ్యాల కొనసాగింపు అనేది అంతర్లీనంగా ఉంటుంది. దానికి అనుగుణంగా కృత్యాధార బోధన కోసం వార్షిక, వార, కాలాంశ ప్రణాళికలు రూపొందించుకోవడానికి విద్యాశాఖ రూపొందించిన కరదీపిక సహాయకారిగా నిలుస్తున్నది.
ప్రాథమిక స్థాయిలో భాష, గణితం, పర్యావరణ విద్య వేర్వేరు అంశాలు కావని, వీటి సాధన పునాదుల మీదనే ‘తొలిమెట్టు’ కార్యక్రమం అమలు కానున్నది. అంటే గణిత బోధనలో భాషా నైపుణ్యాలు అంతర్లీనంగా పెంపొందించబడతాయి. గణితంతో పాటు ఏ సబ్జెక్టును అభ్యసనం చేయాలన్నా భాష కీలకపాత్ర పోషిస్తుంది. దానికి అనుగుణంగా ‘తొలిమెట్టు’ కూడా భాషా నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నది. ప్రస్తుతం కనీస పరిజ్ఞాన స్థాయి కన్నా దిగువన 52 శాతం మంది విద్యార్థులు ఉన్నారని చాలా సర్వేలు తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో తొలిమెట్టు కార్యక్రమం విద్యార్థుల సామర్థ్యాలు మెరుగుపర్చడంలో కీలక పాత్ర పోషిస్తుందని విద్యావేత్తలు, మేధావులు అభిప్రాయ పడుతున్నారు.
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలు మెరుగవ్వడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాల పట్ల వివక్ష చూపకుండా, తనవంతుగా కృషిచేయాలి. ఆకర్షణీయమైన తరగతి గదులు, ఆహ్లాదకరమైన వాతావరణం, నాణ్యమైన పౌష్టికాహారం పిల్లలకు అందినప్పుడే వారిలో అభ్యసన సామర్థ్యాలు పెంపొందించబడతాయి. అప్పుడే పిల్లల్లో ఉన్న సృజనాత్మక శక్తులు, నైపుణ్యాలు బయటికి వస్తాయి. తద్వారా విద్యార్థులను అంతర్జాతీయ స్థాయిలో శాస్త్ర, సాంకేతిక రంగాల వైపు మళ్లించేందుకు ప్రో త్సహించవచ్చు. ఆ దిశగా విద్యార్థులు అడుగులు వేసేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘తొలిమెట్టు’ కార్యక్రమం విద్యార్థుల అభివృద్ధికి పునాది అవుతుందనడంలో సందేహం లేదు.
భాస్కర్ యలకంటి
89194 64488
(వ్యాసకర్త: విద్యా సామాజిక విశ్లేషకులు)