న్యూఢిల్లీ: స్వాతంత్య్ర సంరంభం మళ్లీ విరబూసింది. తెలంగాణ వేదికగా ఆ విరోచిత పోరాటం మళ్లీ కండ్లకు కనిపించింది. తెలంగాణ సర్కార్ ఇవాళ హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో అత్యంత వైభవంగా స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్ని నిర్వహించింది. దేశానికి స్వాతంత్య్రాన్ని తీసుకువచ్చిన మహానీయుల వీరగాధల్ని గుర్తు చేసుకున్నది. వివిధ రకాల కళారూపాలతో ఆ నాటి సమరయోధుల ఘన చరిత్రలను ప్రజెంట్ చేశారు. సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని సమరస్పూర్తితో తిలకించారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర స్పూర్తిని తెలంగాణ అత్యంత అలౌకికరీతిలో చాటిన తీరు అనిర్వచనీయం.
స్వాతంత్య్ర ఉత్సవ వేడుకల్ని సీఎం కేసీఆర్ ఆసక్తితో తిలకించారు. స్టేజ్పై సాగిన ప్రతి భావోద్వేగ సన్నివేశాన్ని ఆయన మెచ్చుకున్నారు.. తన చప్పట్లతో ఆర్టిస్టులను ప్రోత్సహించారు. నరనరాన దేశభక్తిని చాటే ఇన్స్పిరేషన్ మ్యూజిక్తో ఝాన్సీ రాణి లక్ష్మీభాయ్ పాత్ర ఆకట్టుకున్నది. రాణి లక్ష్మీభాయ్ త్యాగాన్ని.. శౌర్యాన్ని ఆ ఆర్టిస్టు తన నటనలో ప్రదర్శించింది. బ్రిటీష్ ఆర్మరీ, ఆర్మీని ఎలా ఆ మహిళలు ఎదుర్కొన్నారో కళాకారులు తమ ప్రదర్శనలో చూపించారు.
కత్తిపట్టిన ఆనాటి మహిళలు, కూతుళ్ల గాధలు దేశ ఔనత్యాన్ని చాటాయి. తమిళ రాణి వేలు నచియార్ ఎలా ఈస్ట్ ఇండియా కంపెనీ ఆగడాలను ఎదుర్కొన్నారో అద్భుతంగా తన నటనతో ప్రదర్శించారు. దేశ స్వాతంత్య్ర కోసం ప్రాణత్యాగం చేసిన ధీశాలి మహిళల చరిత్రలు తెలంగాణ నేలపై నాట్య రూపంలో జాతి భక్తిని చాటాయి.
స్వాతంత్య్ర సమరయోధురాలు లక్ష్మీ స్వామినాథన్ పాత్రలో ఓ ఆర్టిస్టు ఆకట్టుకున్నారు. సుభాష్ చంద్రబోస్తో కలిసి సింగపూర్లో ఆమె వుమెన్ ఆర్మీ ఏర్పాటు చేసిన సన్నివేశాల్ని అద్భుతమైన రీతిలో తన నటనతో చూపించారు. ఆ నాడు స్వతంత్య్ర యుద్ధంలో చేరిన మహిళలను రాణి అని పిలిచేవారని స్పూర్తికర రీతిలో చెప్పించారు. వివిధ బృందాలు కూడా తమ ప్రదర్శనతో జాతిభక్తిని చాటాయి.
వజ్రోత్సవ మువ్వన్నెల జెండాల తయారీ బాధ్యతలను తెలంగాణ సర్కారు చేపట్టింది. జెండాల తయారీ కోసం 12 రాష్ట్రాల నుంచి ఆర్డర్లు కూడా వచ్చాయి. ఆ నాటి సమరయోధులు ఎలాంటి స్పూర్తితో ఉద్యమాన్ని నడిపారో.. ఆ పట్టుదల, బాధ్యతతోనే తెలంగాణ సర్కార్ కూడా టెక్స్టైల్ రంగానికి భరోసా ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం జాతీయ జెండాలను చేనేత కార్మికులతో తయారీ చేయించింది. వజ్రోత్సవ వేడుక కోసం కోటి జెండాలను తెలంగాణ సర్కార్ కానుకగా ఇచ్చింది.
జయత జయతు భారతం .. వసుదైవ కుటుంబకం అంటూ సాగిన న్యాట విన్యాసం ఆనాటి స్వతంత్య్ర కాంక్షను కండ్లకు కట్టింది. మా తుజే సలాం.. వందేమాతం అంటూ రెహ్మాన్ సాంగ్ ఆహుత్ని ఆకట్టుకున్నది. ఈ పాటపై గ్రూప్ డ్యాన్స్ చేశారు. మొత్తం లేడీ ఆర్టిస్టులు.. భారతీయ సాంప్రదాయ వస్త్రధారణతో సాంగ్పై కళకళలాడిపోయారు. స్వాతంత్య్ర స్పూర్తిని తమ డ్యాన్స్తో చాటారు.
జయజయ ప్రియ భారతి జనయిత్రి దివ్యధాత్రి.. జయ వసంత కుసుమలత అంటూ భారత చరిత్రను ఓ బృందం తమ సుమధుర గానంతో వినిపించారు. స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన స్త్రీమూర్తులకు తెలంగాణ సర్కార్ తనదైన శైలిలో సలాం కొట్టింది.