హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం హోంగార్డుల గౌరవ వేతనాలను 30 శాతం పెంచింది. పెరిగిన వేతనాలను ఈ ఏడాది జూలై 1 నుంచి వర్తింపజేయనున్నారు. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. 2018 జూన్ నాటి గౌరవ వేతనంపై 30 శాతం పెంపుదల ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తదుపరి పెంపుదల రాష్ట్ర ప్రభుత్వంలోని కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల గౌరవ వేతనాలు పెంచినప్పుడు మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. పెరిగిన గౌరవ వేతనాల అమలుకు తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి సూచించారు. ఈ పెంపుదలతో రాష్ట్రంలోని 18,491 మంది హోంగార్డులు లబ్ధిపొందనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సరైన వేతనాలు లేక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న హోంగార్డులకు ఊరటనిచ్చేలా సీఎం కేసీఆర్ మానవీయ కోణంలో ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. తాజా పెంపుదలపై హోంగార్డులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.