హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పెన్షన్దారుల పీఆర్సీ బకాయిలను వచ్చే ఏడాది జనవరి నుంచి చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 36 సమాన వాయి దాల్లో బకాయిలు చెల్లించనున్నది. ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు శుక్రవారం జీవో 1,406 జారీచేశారు. 2020 పీఆర్సీ ద్వారా విశ్రాంత ఉద్యోగుల పెన్షన్ కూడా పెరిగింది. గ్రాట్యుటీని రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షలకు పెంచారు. వీటిని పెన్షన్దారులకు చెల్లించాల్సి ఉన్నది. 2020 ఏప్రిల్ 1 నుంచి 2021 మార్చి 31 వరకు ఉన్న బకాయిలను 36 విడతల్లో చెల్లిస్తామని ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది.
తాజా జీవో ప్రకారం పెన్షన్, గ్రాట్యుటీ బకాయిలు ఫిబ్రవరి 1 నుంచి పెన్షన్దారులకు అందుతాయి. 2020 ఏప్రిల్ 1 తర్వాత మరణించిన పెన్షనర్ల కుటుంబాలకు బకాయిలు ఒకేసారి చెల్లిస్తారు. జనవరి పెన్షన్తో కలిపి బకాయిలను ఫిబ్రవరి 1న చెల్లించనున్నట్టు ప్రభుత్వం జీవోలో తెలిపింది. ఒక్కో పెన్షన్దారుడికి రూ.1.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు అదనపు పెన్షన్ రానున్నది. పెన్షన్ బకాయిలు చెల్లింపు జీవో విడుదల చేయడంపట్ల టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్ హర్షం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావుకు కృతజ్ఞతలు తెలిపారు.