హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు 1.3 లక్షల ఎకరాలేనని, కానీ ఉమ్మడి ఏపీ సర్కారు నిబంధనలకు విరుద్ధంగా 3.78 లక్షల ఎకరాలకు పెంచిందని తెలంగాణ సర్కారు ఆక్షేపించింది. ఈ మేరకు కృష్ణా బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్కు సాగునీటి పారుదలశాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ మంగళవారం లేఖ రాశారు. 1952లో హైదరాబాద్ రాష్ట్రం రూపొందించిన నందికొండ ప్రాజెక్టు నివేదికలో నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు నందిగామ తాలుకాలోని కట్టెరువాగు వరకు మాత్రమేనని, అది మొత్తంగా 1.3 లక్షల ఎకరాలేనని వివరించారు. కానీ, 1956లో రాష్ర్టాల పునర్విభజన అనంతరం ఉమ్మడి ఏపీ సర్కారు ఉద్దేశపూర్వకంగా హైదరాబాద్ రాష్ట్ర నివేదికను తుంగలో తొక్కి, ఏపీలోని ఆయకట్టును 1.3 లక్షల ఎకరాల నుంచి 3.78 లక్షల ఎకరాలకు పెంచిందని, తెలంగాణ ఆయకట్టును 6.6 లక్షల ఎకరాల నుంచి 6.02 లక్షల ఎకరాలకు కుదించిందని మండిపడింది.
నాగార్జునసాగర్ ప్రాజెక్టు విషయంలో ఏపీ, హైదరాబాద్ రాష్ర్టాల మధ్య ఎటువంటి ఒప్పందం జరగనందున ఆంధ్రా ఆయకట్టును 1.3 లక్షల ఎకరాలకే పరిమితం చేయాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేసింది. జూలై 15 గెజిట్ నోటిఫికేషన్ షెడ్యూల్-2లోని 4.8 నుంచి 4.14 వరకు ఉన్న అంశాలను తొలగించాలని, ఈ విషయాన్ని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖకు తెలియజేయాలని తెలంగాణ సర్కారు విన్నవించింది.
జల విద్యుత్తు ప్రాజెక్టులను నిలిపివేయాల్సిందే ఎలాంటి అనుమతులు లేకుండా ఏపీ ప్రభుత్వం చేపట్టిన పలు జల విద్యుత్తు ప్రాజెక్టులను వెంటనే నిలిపేయాలని తెలంగాణ సర్కారు డిమాండ్ చేసింది. ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య మండలి (కేఆర్ఎంబీ)కి మరో లేఖ రాసింది. కేఆర్ఎంబీ, అపెక్స్ కౌన్సిల్ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే శ్రీశైలం నుంచి ఎత్తిపోసిన నీటితో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులను ఏపీ ప్రభుత్వం చేపట్టిందని వివరించింది. అందులో కడపలోని గండికోట, అనంతరపురంలోని చిత్రావతి, నెల్లూరులోని సోమశిల, కర్నూల్లోని అవుకు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు ఉన్నాయని, వీటిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ గతంలోనే లేఖలు రాసినప్పటికీ కేఆర్ఎంబీ నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాలేదని వివరించింది. లోటు బేసిన్ అయిన కృష్ణా బేసిన్ నుంచి పెన్నార్ బేసిన్కు ఎత్తిపోసి, అక్కడ జలాశయాలు నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేయటం నిబంధనలకు విరుద్ధమని తెలంగాణ సర్కారు స్పష్టం చేసింది. శ్రీశైలం జలాశయం నుంచి 34 టీఎంసీలను మాత్రమే తరలించేందుకు ఏపీ ప్రభుత్వానికి అనుమతులు ఉన్నాయని, కానీ అందుకు విరుద్ధంగా పోతిరెడ్డిపాడు ద్వారా, దాని కింద ఉన్న బనకచర్ల రెగ్యులేటరీ కాంప్లెక్స్ ద్వారా పెద్ద ఎత్తున నీటిని ఎత్తిపోసి ఆయా రిజర్వాయర్ల నుంచి జల విద్యుత్తు ఉత్పత్తి చేయటం వల్ల తెలంగాణ, బేసిన్లోని ఉన్న ప్రాజెక్టులకు తీవ్ర అన్యాయం చేసినట్టేనని వివరించింది. కేఆర్ఎంబీ వెంటనే స్పందించి ఆ ప్రాజెక్టులను నిలిపేయాలని, ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని తెలంగాణ సర్కారు విజ్ఞప్తి చేసింది.