సిద్ధమైన ఖాళీల జాబితా.. ఉద్యోగులకు ఆప్షన్లు
నేడు, రేపు కౌన్సెలింగ్
29న పోస్టింగ్, 30న జాయినింగ్
జనవరి ఒకటి నుంచి విధుల్లో చేరాలని ప్రభుత్వం ఆదేశాలు
సెలవు రోజుల్లోనూ కార్యాలయాల్లో ఉద్యోగుల సందడి
ఉద్యోగులు, ఉపాధ్యాయుల విభజన ప్రక్రియ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చివరి అంకానికి వచ్చింది. ఇప్పటికే బదిలీకి సంబంధించి ఆర్డర్లు ఇవ్వగా ఆప్షన్ల కోసం సోమ, మంగళ వారాల్లో ఆయా జిల్లా కేంద్రాల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. 2017లో జిల్లాల విభజన జరిగినప్పటి నుంచి తాత్కాలిక సర్దుబాట్లు చేసిన ప్రభుత్వం తాజాగా జోనల్ ప్రాతిపదికన కేటాయింపులు చేస్తున్నది. మూడు జిల్లాల నుంచి ఉద్యోగులు ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు బదిలీ అవుతున్నారు. బదిలీ అయిన వారికి సీనియారిటీ, ప్రతిభ ఆధారంగా 29న పోస్టింగ్ ఇవ్వనున్నారు. జనవరి ఒకటిన విధుల్లో చేరాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆదివారం సెలవు రోజు అయినా ఆయా శాఖలు ఉద్యోగులతో సందడిగా కనిపించింది. తమకు కేటాయించిన జిల్లాల వివరాలు తెలుసుకునేందుకు, బదిలీ రిపోర్టింగ్ ఇచ్చేందుకు వచ్చారు.
నల్లగొండ, డిసెంబర్ 26 : ఉద్యోగుల బదిలీ ప్రక్రియ తుదిదశకు చేరింది. తమను బదిలీ చేయాలని ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించిన నేపథ్యంలో సర్కారు సూచనల మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికి బదిలీ అయ్యే ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆర్డర్లు ఇవ్వగా వారికి సోమ, మంగళ వారాల్లో ఆయా జిల్లాల్లో కౌన్సెలింగ్ ప్రక్రియ జరుగనున్నది. 2017లో జిల్లాల విభజన జరిగినప్పటి నుంచి తాత్కాలిక సర్దుబాట్లు చేసిన ప్రభుత్వం తాజాగా జోనల్ ప్రాతిపదికన జిల్లా కేడర్ కేటాయింపులు చేస్తున్నది. ఈ నేపథ్యంలో నల్లగొండ నుంచి సూర్యాపేట, యాదాద్రిభువనగిరి జిల్లాలకు అక్కడి నుంచి నల్లగొండ జిల్లాకు ఉద్యోగులు బదిలీ అవుతున్నారు. ఆయా జిల్లాకు కేటాయించిన ఉద్యోగులు తమ శాఖల వారీగా ఆయా జిల్లాల్లోని ఖాళీలను బట్టి సీనియారిటీ ప్రాతిపదికన పోస్టింగ్ ఇవ్వనున్నారు. ఈ బదిలీ ప్రక్రియ ప్రత్యక్ష పద్ధతిలో జరుగుతున్నందున ఆన్లైన్లో వివరాలు లేక పోవడంతో ఉద్యోగుల్లో కొంత ఆందోళన నెలకొన్నది. ప్రధానంగా విద్యాశాఖతో పాటు పోలీస్, జడ్పీ, రెవెన్యూలోనే ఎక్కువ మంది ఉద్యోగులు ఉండగా మిగిలిన శాఖల్లో పెద్దగా లేరు. దాంతో బదిలీ ప్రక్రియతో పెద్దగా ఇబ్బందులు ఉండబోవు. ఇప్పటికే ఆయా శాఖల్లో ఇతర
జిల్లాలకు వెళ్లిన ఉద్యోగులతో ఉన్నటువంటి ఖాళీలను ఆయా శాఖలు ప్రదర్శించాయి.
సూర్యాపేటకు 677, యాదాద్రికి 950 మంది
జోనల్ స్థాయిలో జరుగుతున్న బదిలీల్లో భాగంగా సూర్యాపేట, యాదాద్రి జిల్లాల నుంచి నల్లగొండ జిల్లాకు 1067 మంది ఉద్యోగులు వస్తుండగా నల్లగొండ, సూర్యాపేట నుంచి యాదాద్రి జిల్లాకు 950 మందిని కేటాయించారు. యాదాద్రి, నల్లగొండ నుంచి సూర్యాపేట జిల్లాకు 677 మందిని బదిలీ చేస్తున్నారు. సోమవారం ఉదయం పదిన్నరకు కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నది. 610జీఓ ప్రకారం స్థానికతను దృష్టిలో పెట్టుకొని బదిలీ చేయాలని కొందరు ఉపాధ్యాయులు కోరుతుండగా ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన 617 జీఓ ప్రకారమే ప్రక్రియను చేపట్టాలని మరి కొందరు అంటున్నారు. 617 జీఓ ప్రకారం అయితే ఆయా జిల్లాల్లో పోస్టింగ్లు, సీనియారిటీ, విల్లింగ్ను బట్టి ఆయా జిల్లాల్లో ఉద్యోగుల కేటాయింపులు చేయనున్నారు.
నల్లగొండకు 1067 మంది కేటాయింపు
జోనల్ ప్రాతిపదికన జరుగుతున్న బదిలీ ప్రక్రియలో భాగంగా నల్లగొండ జిల్లాకు సూర్యాపేట, యాదాద్రిభువనగిరి జిల్లాల నుంచి 1067 మంది ఉద్యోగులు కేటాయించ బడ్డారు. ఇందులో ఉపాధ్యాయ వర్గంలో స్కూల్ అసిస్టెంట్లు 378 మంది, ఎస్జీటీలు 268 మంది ఉన్నారు. పోలీసులు 128 మంది, ఇతర శాఖలకు చెందిన ఉద్యోగులు 293 మంది ఉన్నారు. ఇందులోనూ రెవెన్యూ శాఖ నుంచి 32 మంది, జడ్పీ ఉద్యోగులు 38 మంది ఉన్నారు. మిగిలిన శాఖల వారు పది మంది లోపే ఉన్నారు. వీరికి సోమ, మంగళవారంలోపు నల్లగొండలో కౌన్సెలింగ్ జరుగనున్నది. ఉపాధ్యాయుల్లో ఎస్జీటీలకు నేడు, స్కూల్ అసిస్టెంట్లకు రేపు డైట్ కళాశాలలో కౌన్సెలింగ్ ప్రక్రియ జరుగనున్నది. పోలీసులకు పోలీస్ కార్యాలయంలో, ఆయా శాఖల ఉద్యోగులకు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కౌన్సెలింగ్ కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. బదిలీలకు సంబంధించి ఆర్డర్లను ఇప్పటికే ఉద్యోగులకు ఇచ్చిన అధికారులు వీటి ఆధారంగా ఆప్షన్ ఫారమ్ తీసుకొని సీనియారిటీ ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహించి, ఈ నెల 29న పోస్టింగ్లు ఇవ్వనున్నారు. సదరు ఉద్యోగులు ఈ నెల 30న పోస్టింగ్ ఇచ్చిన ప్రాంతాల్లో జాయిన్ అవడంతో పాటు జనవరి ఒకటో తేదీ నుంచి విధులకు హాజరు కావాల్సి ఉంటుంది.
సెలవు దినాల్లోనూ సందడి
ఇతర జిల్లాల నుంచి సూర్యాపేటకు 677 మంది వస్తున్నారు. జిల్లాకు వచ్చే వారికి కేటాయింపుల కోసం ఆయా శాఖల్లో ఖాళీలను గుర్తించి నేడు ఆప్షన్లు ఇవ్వనుండగా మరో రెండు రోజుల్లోనే సీనియారిటీ ప్రకారం పోస్టింగ్లు ఇవ్వనున్నట్లు సూర్యాపేట జిల్లా కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి తెలిపారు. తమకు కేటాయించిన జిల్లాల, ఖాళీల వివరాలు తెలుసుకునేందుకు, ఆప్షన్ దరఖాస్తులు ఇచ్చేందుకు ఉపాధ్యాయులు, ఉద్యోగులు తమ జిల్లా కార్యాలయాలకు తరలివచ్చారు. శనివారం, ఆదివారం సెలవు అయినప్పటికీ ఆయా కార్యాలయాల్లో సందడి నెలకొంది.