హైదరాబాద్: దేశానికే తెలంగాణ విద్యా విధానం తలమానికంగా నిలవాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. దశ, దిశలను నిర్దేశించేది ఉపాధ్యాయులేనని పేర్కొన్నారు. విద్య ద్వారానే మానవ వనరుల అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులకు గురుపూజోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తరగతి గదిలో నేర్పిన పాఠాలే దేశ భవిష్యత్తును నిర్దారిస్తాయని అన్నారు.
మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా జరుపుకుంటున్న ఉపాధ్యాయ దినోత్సవం రేపటి తరానికి మార్గదర్శనం కావాలని ఆయన ఆకాంక్షించారు. విద్యాద్వారానే మానవ వనరుల అభివృద్ధి జరుగుతుందని అది గుర్తించిన మీదటనే సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో గురుకులాలు విస్తరించారని ఆయన గుర్తు చేశారు. దేశానికే తెలంగాణ విద్య తలమానికంగా నిలబడాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అని ఆయన చెప్పారు. అటువంటి సంకల్పం నెరవేర్చే గురుతర బాధ్యత ఉపాధ్యాయుల మీద ఉందన్నారు.