వరంగల్ అర్బన్: తెలంగాణ దళితబంధు పథకం ఒక విప్లవమని, ఇలాంటి పథకం దేశంలో ఎక్కడా లేదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. దళితజాతిని అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని తీసుకొచ్చారని చెప్పారు. దళితబంధును అడ్డుకునే పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరంగల్ అర్బన్ కమలాపూర్ మండలం మర్రిపల్లిలో జరిగిన దళిత ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో 20 శాతానికిపైగా దళితులు ఉన్నారని, అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందితేనే దేశం ముందుకు పోతుందన్నారు. వ్యవసాయంలో ఉన్న సమస్యలన్నింటినీ సీఎం కేసీఆర్ పరిష్కరించారని, విదేశాలకు వెళ్లి చదువుకునేందుకు అంబేద్కర్ ఓవర్సీస్ పథకం తీసుకొచ్చారని చెప్పారు. ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకుంటే ఎట్టిపరిస్థితుల్లో వెనక్కి తగ్గరని వెల్లడించారు.
గత పాలకులు దళితులను కేవలం ఓట్లు వేసే వ్యక్తులుగానే చూశారని ఆరోపించారు. బీజేపీ సిద్ధాంతమే దళితులకు వ్యతిరేకమని విమర్శించారు. అడుగడుగునా వివక్షకు గురిచేసి ఇప్పుడు ఓట్లకోసం వస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్ గురంచి మాట్లాడేముందు ఆలోచించాలన్నారు. 1989లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కేసీఆర్ దళితుల గురించి లోచించారని పేర్కొన్నారు. 2003 ఉద్యమ సమయంలో దళిత మేధావులతో దళితవర్గాల అభివృద్ధిపై చర్చించారని వెల్లడించారు. తెలంగాణ ఉద్యమంలో ఒక్కడే ఎలా బయలుదేరిండో.. దళితుల బాగుకోసం ఇప్పుడూ ఒక్కడే బలదేరిండని చెప్పారు.
దళితబంధు పథకం దేశంలో ఎక్కడా లేదని వెల్లడించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై దాడులు పెరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. దళితబంధు పథకాన్ని అడ్డుకుంటున్న బీజేపీని ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 57 ఏండ్లు దాటిన ప్రతి వ్యక్తికి పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు.