హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): నీతి ఆయోగ్ చెప్పే మాటలకు, సిఫారసులకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న గౌరవం సున్నా అని సీఎం కేసీఆర్ విమర్శించారు. ‘ప్రొఫెసర్ జయశంకర్గారి స్నేహితుడు ప్రొఫెసర్ ముంగేఖర్ ముంబై యూనివర్సిటీ వైస్ చాన్సలర్గా ఉండేవారు. ఆయన ప్లానింగ్ కమిషన్ సభ్యుడిగా ఉన్నప్పుడు మేం ఆయనను బతిమాలుకొని భోజనానికి ఇంటికి రావాలని పిలిచి మాట్లాడినం. తెలంగాణలోని రెండు జిల్లాలను ప్రణాళికా సంఘం వెనుకబడిన జిల్లాల జాబితాలో చేర్చేలా సిఫారసు చేయించుకున్నాం. ఎందుకంటే ప్లానింగ్ కమిషన్ జాబితాలో ఒకసారి వెనుకబడిన జిల్లా అని వస్తే కచ్చితంగా కొంత నిధులు వస్తాయి.
ఆ జిల్లాలకు లాభం జరుగుతది అన్న ఆశతోని చేయించున్నాం. కానీ, ఇవ్వాళ నీతిఆయోగ్ పరిస్థితి అలా లేదు. మేం ఎన్నడూ నీతిఆయోగ్ను అడగలేదు.. ఆ సంస్థ సిఫారస్ చేయలేదు. కానీ, వాళ్లంతట వాళ్లే తెలంగాణకు వచ్చి చూసి, ఇక్కడ అమలవుతున్న మిషన్ కాకతీయ పథకం దేశానికే ఆదర్శంగా ఉన్నది.. ఈ పథకానికి రూ.5 వేల కోట్ల నిధులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అట్లనే మిషన్ భగీరథ చాలా మంచి కార్యక్రమం.. దీనికి రూ.19 వేల కోట్లు ఇవ్వండి.. రెండు పథకాలకు కలిపి రూ.24 వేల కోట్లు ఇవ్వండి అని ప్రధానికి స్వయంగా రికమెండ్ చేసింది. ఆ ప్రతిపాదనలు పంపి కూడా ఆరేండ్లు గడుస్తున్నది. కేంద్రం కనీనం 24 పైసలు కూడా ఇవ్వలేదు. నీతిఆయోగ్ ప్రతిపాదనలు బుట్టదాఖలైతే.. మరి ఆ సంస్థకు ఏం విలువు ఉన్నట్టు?
సమగ్ర దృక్పథంతో ఆలోచన చేయటం లేదు
దేశంలోని పరిస్థితులపై లోతైన అధ్యయనం జరగాలి. సమగ్రంగా అర్థం చేసుకోవాలి. చాలా ప్రధానమైన బాధ్యతలో ఉన్న నీతి ఆయోగ్ గొప్పగా ఆలోచన చేసేలా, అందుకు ముఖ్యమంత్రుల బృందాలతో ఉపసంఘాలు వేయాలని కోరాం. కానీ, ఆ ప్రయత్నం జరగలేదు. చివరకు ఒక బృందం వేశారు. దానిలో నేను కూడా సభ్యుడిగా ఉన్నాను. నేను, అప్పటి సీఎస్ రాజీవ్శర్మ అంతా భోపాల్ సమావేశానికి వెళ్లినం. గంటల తరబడి చర్చించి అమూల్యమైన సలహాలిచ్చాం.
మనది సువిశాల దేశం.. భిన్న భౌగోళిక పరిస్థితుల ప్రాంతం. కశ్మీర్, హిమాచల్, పంజాబ్, ఉత్తరప్రదేశ్లోని కొన్ని హిమాలయాలకు దగ్గరి ప్రాంతాలు, ఉత్తరాఖండ్ ఇట్లా శీతల వాతావరణం ఉన్న రాష్ర్టాలు ఉన్నవి. అట్లనే సముద్రతీరం ఉన్నవి. తెలంగాణ, మధ్యప్రదేశ్ వంటి ల్యాండ్లాక్డ్ రాష్ర్టాలు కూడా ఉన్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన సహజ సంపద, ఖనిజాలు ఉన్నాయి. అవన్నీ దేశ ప్రగతికి ఉపయోగపడాలంటే సమగ్ర దృక్పథంతో ఆలోచించాలని చెప్పాం. ఎవరి సమస్యలు వారికే తెలుస్తాయి కాబట్టి కేంద్రం ఇచ్చే గ్రాంటు రాష్ర్టాలకే ఇస్తే బాగుంటదని ప్రతిపాదించాం. ‘ఇది మంచి ప్రతిపాదన అంగీకరిద్దాం’ అని ప్రధాని అందరి ముందు అన్నారు. కానీ ఆచరణలో సున్నా’ అని పేర్కొన్నారు.