కేసీఆర్ ప్రెస్మీట్: కేంద్ర ప్రభుత్వం పెట్రో ధరలు పెంచింది కొండంత.. తగ్గించింది పిసరంత అని సీఎం కేసీఆర్ తనదైన శైలిలో విమర్శించారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరగకున్నా పెట్రో ఉత్పత్తులపై కేంద్రం సెస్ విధిస్తోందని మండిపడ్డారు. ఈ విషయంపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కూడా అబద్ధాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. ఆదివారం ఆయన ప్రగతిభవన్లో మీడియాతో మాట్లాడారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు ప్రస్తుతం ఎంత ఉందో ఎవరైనా తెలుసుకోవచ్చని, కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్రెడ్డికి ఈ విషయం తెలియదా అని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. అడ్డగోలుగా సెస్ విధిస్తూ రాష్ట్రం పన్నులు వదులుకోవాలంటూ డిమాండ్ చేయడం సరికాదన్నారు. 2014లో ఎంత వ్యాట్ ఉందో రాష్ట్రంలో ఇప్పటికీ అంతే వ్యాట్ ఉందని వివరించారు. కేంద్రం పూర్తిస్థాయిలో సెస్ రద్దు చేస్తే పెట్రోల్ ధర లీటర్కు రూ. 77 కు దిగి వస్తుందన్నారు. కేంద్రం సెస్ రద్దు చేసేదాకా తాము పోరాడతామని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు.