భీమ్గల్, డిసెంబర్ 7: స్వరాష్ట్రంలో పట్టణాలు అభివృద్ధి బాటపట్టాయని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి స్పష్టం చేశారు. ఇందుకు భీమ్గల్లో జరుగుతున్న అభివృద్ధి పనులే నిదర్శనమన్నారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్లో రూ.33 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో కలిసి మంత్రి వేముల శంకుస్థాపన చేశారు. అంతకుముందు మంత్రి వేముల, ఎమ్మెల్సీ కవిత పట్టణంలోని పలు వార్డుల్లో సుమారు మూడు గంటలపాటు కాలినడకన పర్యటించారు. స్థానికులను ఆప్యాయంగా పలుకరిస్తూ ముందుకు కదిలారు.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. గతంలో భీమ్గల్ పట్టణం ఎంతో వెనుకబడి ఉండేదన్నారు. అలాంటి పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలన్న తన కల ప్రస్తుతం సాకారమవుతున్నదని తెలిపారు. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కృషితో భీమ్గల్ మున్సిపాలిటీగా మారిందని చెప్పారు. రూ.25 కోట్లు మంజూరు కావడంతో పట్టణం అభివృద్ధి బాట పట్టిందన్నారు. పట్టణ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చినట్టు ఆయన చెప్పారు. వంద పడకల దవాఖాన మంజూరు అంశం కరోనాతో నెలకొన్న ఇబ్బందులతో జాప్యం జరిగిందని, త్వరలో ఆ హామీ కూడా నెరవేరుస్తామని మంత్రి తెలిపారు.
పనిచేసే వారికి మద్దతుగా నిలువాలి: కవిత
రాజకీయాల కోసం మాట్లాడే వారికి కాకుండా ప్రజల కోసం బాధ్యతతో పని చేసే నాయకులకే మద్దతుగా నిలువాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు. ఏడేండ్ల క్రితం అభివృద్ధిలో వెనుకంజలో ఉన్న రాష్ట్రం నేడు దేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. అభివృద్ధి కండ్ల ముందే కన్పిస్తున్నా కొంతమంది రాజకీయ పబ్బం గడుపుకొనేందుకు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పనిచేసే నాయకులకు ప్రజ ల ఆశీర్వాదం తప్పక ఉంటుందని తెలిపారు. సీఎం కేసీఆర్ను ప్రజలు రెండుసార్లు దీవించిన విషయాన్ని గుర్తుచేశారు. కత్తి ఒకరికిచ్చి యుద్ధం మరొకరిని చేయమనడం సరికాదన్నారు. రాజకీయాల కోసమే కొంద రు బీజేపీ నాయకులు బట్టేబాజ్ మాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. మంత్రి వేముల కృషితో భీమ్గల్ అభివృద్ధిలో దూసుకుపోతున్నదన్నారు.