హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం.. రైతు వ్యతిరేక ప్రభుత్వం అంటూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం ఆగ్రహం వ్యక్తం చేసింది. రైతు వ్యతిరేక ప్రభుత్వం ఎవరిది? కేంద్రంలోని బీజేపీ సర్కారుదా? రాష్ట్రంలోని టీఆర్ఎస్ సర్కారుదా? రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చినవాళ్లదా? రైతుబంధు ఇచ్చిన వాళ్లు రైతు వ్యతిరేకులా? సమాధానం చెప్పాలని ప్రజలు గోయల్ను నిలదీస్తున్నారు. రైతులను కష్టాల్లోకి నెట్టేలా నల్ల చట్టాలను తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని మండిపడుతున్నారు. ‘రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయబోమని చెప్పిన కేంద్రానిది రైతు వ్యతిరేక ప్రభుత్వం. రైతుల నడ్డి విరిచేలా ఎరువుల ధరలు, డీజిల్ ధరలను పెంచిన మోదీ సర్కారుది రైతు వ్యతిరేక ప్రభుత్వం’ అని నిప్పులు చెరిగారు.
తెలంగాణ ప్రభుత్వం గత ఏడేండ్లలో వ్యవసాయ రంగం ముఖచిత్రాన్నే మార్చేసిందని, కాళేశ్వరం వంటి గొప్ప ప్రాజెక్టు నిర్మాణంతో సాగునీటి గోసను తీర్చిందని తెలిపారు. మరి.. కేంద్రంలోని బీజేపీ సర్కారు చేసిన మేలేంటని ప్రశ్నించారు. ‘తెలంగాణ ప్రభుత్వం.. రైతుబంధు పేరుతో పెట్టుబడి గోస తీర్చింది. రైతుబీమాతో రైతు కుటుంబాలకు అండగా ఉంటున్నది. 24 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తూ కరెంటు గోసను తీర్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అదే కేంద్రం చేసింది ఒక్కటంటే ఒక్కటైనా ఉన్నదా?’ అని ప్రశ్నిస్తున్నారు. దీన్నిబట్టే రైతు వ్యతిరేక ప్రభుత్వం ఎవరిదో? రైతు పక్షపాత ప్రభుత్వం ఎవరిదో? తేలిపోతుందని వ్యాఖ్యానిస్తున్నారు.