హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ), కమ్మర్పల్లి/ఆర్మూర్: రైతు, ప్రజా సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్ మోడల్గా నిలిచిందని దక్షిణాది రాష్ర్టాల రైతుల సంఘాల నేతలు అన్నారు. ముఖ్యంగా వ్యవసాయరంగ పథకాల్లో దేశంలోనే తెలంగాణ తొలి స్థానంలో ఉన్నదని కితాబిచ్చారు. దేశవ్యాప్తంగా రైతులు, ప్రజలు సంతోషంగా ఉండాలంటే తెలంగాణలో అమలవుతున్న పథకాలను అన్ని రాష్ర్టాల్లో అమలు చేయాలని అభిప్రాయపడ్డారు. దక్షిణాది రాష్ర్టాల రైతు సంఘాల నేతలు శుక్రవారం చెన్నైలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ఈ భేటీలో తమిళనాడు ఫార్మర్స్ అసోసియేషన్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ దైవ శివామణి, రాష్ట్రీయ కిసాన్ మహాసంఘ్ కర్ణాటక అధ్యక్షుడు శాంత కుమార్, రాష్ట్రీయ మహాసంఘ్ (కేరళ) కో ఆర్డినేటర్ పీపీ జాన్, తమిళనాడు వ్యవసాయ సంఘం అధ్యక్షుడు రామ గౌండర్, పాండిచ్చేరి వ్యవసాయ సంఘం అధ్యక్షుడు నికోలస్, కోయంబత్తూర్ రైతు నాయకుడు బాబు, జాతీయ రైతు సంఘం ఉపాధ్యక్షుడు, పసుపు బోర్డు సాధన సమితి అధ్యక్షుడు కోటపాటి నరసింహ నాయుడు ఇతర రైతు నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ పథకాలు అద్భుతం
తెలంగాణలో అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. తెలంగాణ నుంచి వెళ్లిన తాను ఇక్కడి పథకాల గురించి దక్షిణాది రైతు నేతలకు వివరించగా అందరూ ఆశ్చర్యపోయినట్టు నర్సింహనాయుడు తెలిపారు. రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్తు, కాళేశ్వరంతో పాటు ఇతర నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం, అధిక వ్యవసాయ బడ్జెట్, మద్దతు ధరకు పంటల కొనుగోలు, వీటితోపాటు కల్యాణలక్ష్మి, ఉచితంగా చేప పిల్లల పంపిణీ, సబ్సిడీపై గొర్రెల పంపిణీ, రూ.2 వేల పింఛన్, రైతు వేదికలు, రైతుబంధు సమితులు, రైతు రుణమాఫీ, నీటి పన్ను రద్దు తదితరాలపై ఈ సందర్భంగా చర్చించారు. తెలంగాణలో అమలవుతున్న ఈ పథకాలు, కార్యక్రమాల గురించి విన్న ఇతర రాష్ర్టాల రైతు నేతలు.. తమ రాష్ర్టాల్లోనూ ఇలాంటి పథకాలు అమలైతే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా రైతుబంధు, రైతుబీమా పథకాల గురించి తెలుసుకొని.. ఇవి సాధ్యమేనా! అన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. రైతుబంధు కోసం ఇప్పటికే రూ.50 వేల కోట్లు ఖర్చు చేయడం పట్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు.
తెలంగాణ పథకాలు దేశవ్యాప్తంగా అమలుచేయాలి
తెలంగాణలో అమలవుతున్న రైతు సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఈ సందర్భంగా రైతు సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే దేశంలోని అన్ని రాష్ర్టాల సీఎంలను కలిసి, తెలంగాణలో అమలవుతున్న ఈ పథకాల గురించి తెలియజేయాలని నిర్ణయించారు. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలన్నీ రైతులకు ఎంతో మేలు చేసేవిగా ఉన్నాయని వారు అభిప్రాయపడ్డారు. అన్ని రాష్ర్టాల్లో ఈ పథకాలను అమలు చేస్తే, ఆయా రాష్ర్టాల్లో రైతులకు ఇబ్బందులు తప్పుతాయనే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.
కేంద్రంపై ఉద్యమించాలి
కేంద్రంలోని బీజేపీ సర్కారు రైతు వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నదని రైతు సంఘాల నేతలు విమర్శించారు. అన్ని అంశాల్లోనూ రైతులకు అన్యాయం చేస్తున్నదని మండిపడ్డారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మోదీ సర్కారుపై ఉద్యమించాలని నిర్ణయించారు. ముఖ్యంగా పంటలకు మద్దతు ధర దక్కేలా, మద్దతు ధరకు చట్టం చేసేలా కేంద్రంపై ఒత్తిడి పెంచాలని తీర్మానించారు.
సీఎం స్టాలిన్తో భేటీ
తెలంగాణలో అమలవుతున్న రైతు సంక్షేమ, ప్రజా సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయించడం కోసం అన్ని రాష్ర్టాల సీఎంలతో భేటీ అయి, ఈ పథకాల అమలుపై చర్చించాలని నిర్ణయించిన రైతు నేతలు.. తొలుత తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్తో శుక్రవారం భేటీ అయ్యారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ.. తెలంగాణలో అమలవుతున్న పథకాలు అద్భుతంగా ఉన్నాయని, తమ రాష్ట్రంలోనూ అమలు చేసేందుకు చర్యలు తీసుకొంటామని రైతు సంఘాల నేతలకు తెలిపారు. ఇక మద్దతు ధరపై చట్టం చేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని స్టాలిన్ను కోరగా.. సానుకూలంగా స్పందించారు. తమిళనాడు ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వమని తెలిపారు. ఇక పసుపు పంటకు రూ.15 వేల మద్దతు ధరను ఇవ్వడంతోపాటు పసుపు పంటపై 5% జీఎస్టీని వెనక్కి తీసుకొనేలా ఒత్తిడి తేవాలని స్టాలిన్ను రైతు నేతలు కోరారు.
దక్షిణాది రైతు సంఘాలు ప్రశంసించిన తెలంగాణలోని రైతు సంక్షేమ పథకాలు
ఇటీవల కెనడా నుంచి వచ్చిన ఒక ఎన్నారై తెలంగాణలో భూమి కొనాలనుకున్నాడు. తక్కువ ధర ఎక్కడుందా అని వెతుకుతూ ముథోల్ – భైంసా అవతల మహారాష్ట్ర నాందేడ్ ధర్మాబాద్ రోడ్డు దాకా వెళ్లాడు. ఇవతల తెలంగాణ.. అవతల మహారాష్ట్ర. రెండూ ఒకేరకం (నల్లరేగడి) భూములే. రెంటికీ నీటి వసతి ఉన్నది. ఎకరం ఎంత అని తెలంగాణలోని గ్రామ రైతుల్ని అడిగాడు. వారు రూ.20 లక్షలని చెప్పారు. సరిహద్దు దాటి మహారాష్ట్రలోని కుండల్వాడి, బిలోలి గ్రామాల రైతుల్నీ ఆరా తీశాడు. వారు ఎకరా రూ.5 లక్షలన్నారు.
ఇదీ సీఎం కేసీఆర్ అమలు చేసిన రైతు పథకాల ఫలితం
తెలంగాణలోని పథకాలు మాకు అమలు చేస్తారా? లేక మమ్మల్ని తెలంగాణలో విలీనం చేస్తారా? ఇదీ సరిహద్దుల్లో నిన్నటి డిమాండ్. మరి ఇప్పుడు.. తెలంగాణ రైతు పథకాలను దేశమంతా అమలు చేయాలి ఇది దక్షిణాదిలో నేటి డిమాండ్
ఆ 2 పథకాలు విని ఆశ్చర్యపోయా
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా పథకాల గురించి విని ఆశ్చర్యపోయాను. ప్రతి రైతుకు ఎన్ని ఎకరాల భూమి ఉంటే అన్ని ఎకరాలకు ఏడాదికి ఎకరాకు రూ.10 వేలు ఇవ్వడం సామాన్యమైన విషయం కాదు. రైతుబీమాతో ఆ రైతు కుటుంబానికి ఆర్థిక భరోసా లభిస్తుంది. అంతే కాకుండా ఉచిత విద్యుత్తు వంటి ఎన్నో పథకాలు రైతులకు ఎంతో ఉపయోగంగా ఉంటాయి. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న ఈ పథకాలు దేశానికే రోల్ మోడల్. దేశ రైతులు సుభిక్షంగా ఉండాలంటే తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను అన్ని రాష్ర్టాల్లోనూ అమలు చేయాలి.
-పీపీ జాన్, రాష్ట్రీయ కిసాన్ మహాసంఘ్ కో-ఆర్డినేటర్, కేరళ
రైతుల పక్షాన మోదీకి లేఖ రాయడం అభినందనీయం
తెలంగాణలో అమలవుతున్న రైతు కేంద్రీకృత పథకాలు అద్భుతంగా ఉన్నాయి. ప్రతి పథకం కూడా రైతులకు మేలు చేస్తుంది. దళారుల ఇబ్బంది లేకుండా రైతుకే నేరుగా లబ్ధి చేకూరుతుంది. ఒక కొత్త రాష్ట్రం ఇంత గొప్ప కార్యక్రమాలు చేస్తుంటే కేంద్రంలోని మోదీ సర్కారు మాత్రం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నది. కేంద్ర రైతు వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాయడం అభినందనీయం.
-శాంతాకుమార్, కర్ణాటక సంయుక్త కిసాన్ మోర్చా అధ్యక్షుడు
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం వహించాలి
వ్యవసాయం రంగంలో తెలంగాణ అవలంబిస్తున్న విధానాలు అద్భుతంగా ఉన్నాయి. రైతుబంధు, రైతుబీమాతోపాటు రైతులు పండించిన ప్రతి గింజను 7 వేల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి, కొనుగోలు చేయడం అద్భుతం. అయితే రైతుల పంటలకు మద్దతు ధర ఇవ్వడంలో కేంద్రంలోని మోదీ సర్కారు పూర్తిగా విఫలమైంది. ఎమ్మెస్పీపై ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ రాసి, రైతుల పట్ల తనకున్న ప్రేమను చాటుకొన్నారు. ఇది ఇంతటితో ఆగేది కాదు. ప్రతి పంటకు మద్దతు ధర దక్కేలా, మద్దతు ధరకు చట్టం చేసేలా కేంద్ర ప్రభుత్వంపై ఉద్యమించాలి. ఇందుకు సీఎం కేసీఆర్ దేశ రైతాంగం పక్షాన నాయకత్వం వహించాలని కోరుకొంటున్నాం.
-నరసింహంనాయుడు, జాతీయ రైతు సంఘం ఉపాధ్యక్షుడు