Uttar Pradesh | నాన్నా నన్ను కాపాడు. నా కారు ప్రమాదానికి గురయింది. కారుతో పాటు నేనూ నీటిలో మునిగిపోతున్నాను. నాకు బతకాలనుంది నాన్నా అంటూ 27 ఏల్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ తండ్రికి ఫోన్ చేసి వేడుకున్నాడు. తండ్రి అలర్ట్ అయి పోలీసులకు సమాచారం ఇచ్చి వెంటనే స్పాట్కు చేరుకున్నాడు. లోతైన నీటి గుంతలో కుమారుడు తన కళ్లముందే జలసమాధి అవుతుండటాన్నిచూసి ఆ తండ్రి తల్లడిల్లి పోయాడు. నాన్నా నాన్ను కాపాడు.. నాకు చావాలని లేదు అంటూ కోడుకు ఆక్రందన ఆ తండ్రి గుండెను పిండేసింది. ఉత్తర్ప్రదేశ్లోని నోయిడాలో ఈ ఘోరం జరిగింది. పోలీసులు, అధికార యంత్రాంగం సకాలంలో స్పందించి ఉంటే నా కొడుకు బతికేవాడని ఆ తండ్రి బోరున విలపించాడు.
గురుగావ్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో డాటా అనలిస్టుగా పనిచేస్తున్న యువరాజ్ అనే టెకీ ఈ నెల 16న రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దట్టమైన పోగమంచులో దారి కనిపించక యువరాజ్ కారు రోడ్డు పక్కనున్న లోతైన గుంతలోకి దూసుకుపోయింది. నీటిలో మునిగిపోతున్న కారులోనుంచే యువరాజ్ కేకలు వేశాడు. హెల్ప్ హెల్ప్ అని అరిచాడు. తండ్రికి, స్నేహితుడికి ఫోన్ చేసి కాపాడాలంటూ వేడుకున్నాడు. తండ్రి ఇచ్చిన సమాచారంతో పోలీసులు అరగంటలో స్పాట్కు చేరుకున్నా ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ టీం రావడం ఆలస్యమైంది. రక్షణ సామాగ్రితో అక్కడకి చేరుకుని కారును నీటిలోనుంచి తీయడానికి ఐదు గంటలు పట్టింది. దీంతో యువరాజ్ అందరి చూస్తుండగానే నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. రాత్రి 12గంటల సమయంలో ఘటన జరగడం వల్ల సహాయక బృందాలు స్పాట్కు చేరుకోవడం ఆలస్యమవడంతో పాటు దట్టమైన పొగమంచు కారణంగా యువరాజ్ ప్రాణాలు కాపాడలేకపోయారు.
గంటా 45 నిమిషాలపాటు తనను కాపాడాలంటూ యువరాజ్ వేడుకున్నాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సరైన రక్షణ పరికరాలతో సకాలంలో ఘటనాస్థలానికి అధికార యంత్రాంగం చేరుకుని ఉంటే తన బిడ్డ బతికేవాడని యువరాజ్ తండ్రి రాజ్కుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు. నీటి గుంత ఎక్కువ లోతు ఉండటంతో దట్టమైన పొగమంచులో స్పాట్ను వెంటనే గుర్తించలేకపోయామని రెస్క్యూ టీం చెబుతున్నారు. యూపీ సర్కార్ ఈ ఘటనను సీరియస్ తీసుకుంది. నోయిడా అథారిటీ సీఈఓపై వేటు వేసింది. ఈ ప్రమాదంపై సిట్ విచారణకు ఆదేశించింది. అడిషనల్ జనరల్ ఆఫ్ పోలీసు నేతృత్వంలో త్రిసభ్య దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఎంజీ విస్టర్ సోసైటీకి చెందిన బిల్డర్ అభయ్కుమార్ను పోలీసులు అరెస్టు చేశారు. యువరాజ్ తండ్రి ఫిర్యాదుతో బేస్మెంట్ కోసం పెద్ద గుంతను తవ్విన రెండు నిర్మాణ సంస్థలపై కేసు నమోదు చేశారు. కొందరి నిర్లక్ష్యం వల్ల ఇలా అమాయకుల ప్రాణాలు కోల్పోవడం నోయిడాలో ఇది కామనే. ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. ఇన్సిడెంట్ జరిగినపుడు బాధ్యులపై చర్యలు తీసుకున్నా కొన్నాళ్లకు మళ్లీ కొందరి నిర్లక్ష్యం వల్ల ఎవరో ఒకరు బలవుతున్నారు.