ముంబై, మే 13: దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన టెక్ మహీంద్రా ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.1,678.40 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.9,729 కోట్ల నుంచి రూ.12,116 కోట్లకు చేరుకున్నది. 2021-22 ఏడాదికిగాను రూ.5,566 కోట్ల స్టాండ్లోన్ నికర లాభాన్ని గడించింది.
గడిచిన త్రైమాసికంలో బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలను కుదుర్చుకున్న సంస్థ..చివరి త్రైమాసికంలో 3 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలను కుదుర్చుకున్నది. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ, సీఈవో సీపీ గుర్నానీ మాట్లాడుతూ..ఇదే ఉత్సాహంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిలకడైన వృద్ధిని సాధించే అవకాశాలున్నాయన్నారు.
రష్యా-ఉక్రెయిన్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు, అమెరికా ద్రవ్యోల్బణం రికార్డు స్థాయికి దూసుకుపోతున్నప్పటికీ సంస్థపై ఎలాంటి ప్రభావం పడలేదన్నారు. గడిచిన సంవత్సరంలో 10 వేల మంది ఫ్రెషర్లను నియమించుకున్న సంస్థ ఈ ఏడాది కూడా అంతే స్థాయిలో రిక్రూట్ చేసుకోవాలనుకుంటున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం సంస్థలో 1.51 లక్షల మంది విధులు నిర్వహిస్తున్నారు.