మెదక్, సిద్దిపేట జిల్లాల నుంచి కేటాయించబడిన 532 మంది ఉపాధ్యాయులు
8 మంది బోధనేతర సిబ్బంది
కౌన్సెలింగ్కు హాజరైన 514 మంది టీచర్లు
పర్యవేక్షించిన కలెక్టర్ హనుమంతరావు
సంగారెడ్డి కలెక్టరేట్, డిసెంబర్ 27: ఉపాధ్యాయుల కౌన్సెలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగుల బదలాయింపులో భాగంగా మెదక్, సిద్దిపేట జిల్లాల నుంచి మొత్తం 532 మంది ఉపాద్యాయులు సంగారెడ్డి జిల్లాకు కేటాయించారు. ఇందులో మెదక్ జిల్లా నుంచి 497 మంది, సిద్దిపేట జిల్లా నుంచి 35 మంది కేటాయించిన వారిలో ఉన్నారు. అయితే, 532 మందిలో 524 మంది ఉపాధ్యాయులు కాగా, 8 మంది బోధనేతర సిబ్బంది ఉన్నారు. ఆదివారం కలెక్టరేట్లో స్వీకరించిన ఆప్షన్ ఫారాల్లో భాగంగా 514 మంది మాత్రమే తమ ఆప్షన్ ఫారాలను సమర్పించారు. వివిధ కారణాలతో మిగతా 18 మంది తమ ఆప్షన్ ఫారాలు సమర్పించలేదు. ఆప్షన్ ఫారాలను అందజేసిన ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి సంబంధించిన కౌన్సెలింగ్ సోమవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో పూర్తయింది. అయితే తొలుత ఆయా ఉపాధ్యాయ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో తమకు ఇష్టమైన ఖాళీలను ఎంచుకోవాలంటే జిల్లాలో ఉన్న ఖాళీలన్నింటినీ చూపించాల్సిందేనని పట్టుబట్టారు. కలెక్టరేట్ ఆవరణలో ఒకింత ఆందోళనకర పరిస్థితి నెలకొన్నది. వెంటనే అక్కడికి చేరుకున్న కలెక్టర్ హనుమంతరావు ఉపాధ్యాయులందరికీ న్యాయం జరుగుతుందని నచ్చజెప్పారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారమే కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు. అందరూ కలిసి సమన్వయంతో పని చేసినప్పుడే తమ బాధ్యతను నిర్వర్తించిన వారమవుతామని పేర్కొన్నారు. నియమ నిబంధనలకు లోబడే ఉపాధ్యాయుల కౌన్సెలింగ్ జరుగుతున్నందున ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ సూచించారు. రాబోయే కాలంలో అందరికీ మంచి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. దీంతో ఉపాధ్యాయులు శాంతించి, కౌన్సెలింగ్కు పూర్తిగా సహకరించారు. కౌన్సెలింగ్కు హాజరైన ఉపాధ్యాయులకు పోస్టింగ్ ఉత్తర్వులను అందజేశారు. ఆయా ఉత్తర్వులు అందుకున్న ఉపాధ్యాయులు రెండు మూడు రోజుల్లో కొత్త స్థానాల్లో రిపోర్ట్ చేయనున్నారు.
ఉన్నతాధికారుల సమక్షంలో..
కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన ఉపాధ్యాయుల కౌన్సెలింగ్ జిల్లా ఉన్నతాధికారుల సమక్షంలో కొనసాగింది. కలెక్టర్ హనుమంతరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కౌన్సెలింగ్లో జిల్లా అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, రాజర్షి షా, జిల్లా రెవెన్యూ అధికారి రాధిక రమణి, ఆర్డీవోలు మెంచు నగేశ్, అంబదాస్ రాజేశ్వర్, డీఈవో నాంపల్లి రాజేశ్, ఏడీ విజయ తదితరులు ప్రక్రియ పూర్తయ్యేదాకా పరిస్థితులను చక్కదిద్దారు.
భారీ స్థాయిలో ఏర్పాట్లు..
కౌన్సెలింగ్ నేపథ్యంలో ఉపాధ్యాయులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. కలెక్టరేట్ ఆడిటోరియం ఎదుట భారీ షామియానాలు వేసి, ఆ మేరకు కుర్చీలు, తాగునీరు, టీ, స్నాక్స్, భోజన సౌకర్యాలు కల్పించారు. ఆడిటోరియం లోపల, బయట భారీ స్క్రీన్లను ఏర్పాటు చేసి ఉపాద్యాయులు ఏ స్థానాల్లో భర్తీ అయ్యారు? ఇంకా ఏ ఖాళీలు అందుబాటులో ఉన్నాయనే వివరాలను ఎప్పటికప్పుడు పొందుపర్చారు.ఈ కార్యక్రమంలో ఆయా ఉపాధ్యాయ సంఘాల నాయకులు వై అశోక్ కుమార్, మదన్గోపాల్, సయ్యద్ సాబేర్ అలీ, సాయిలు, లక్ష్మారెడ్డి, మాణయ్య, సోమశేఖర్, ఉప విద్యాధికారులు, ఎంఈవోలు పాల్గొన్నారు.