వసంతం ఇంకా రానేలేదు.. అప్పుడే ఎండలు మొదలయ్యాయి. ఇన్నాళ్లూ చలికాలంలో ఆచరించిన ఆహార నియమాలనే ఇప్పుడూ కొనసాగిస్తానంటే కుదరదు. కాలానికి తగ్గట్లుగా ఆహార వ్యవహారాలు మార్చుకోవాలని సూచిస్తున్నారు హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు. ఈ కాలంలో పాటించాల్సిన ఆహార నియమాలు..
వేసవిలో టీ, కాఫీలు తగ్గించాలి. వీలైతే వాటికి దూరంగా ఉండాలి. మండే ఎండల్లో టీ, కాఫీ తాగడం వల్ల శరీరంలో మరింత వేడి ఉత్పత్తి అవుతుంది. ఎసిడిటి, గ్యాస్ ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి.
వేసవిలో నూనె పదార్థాలు వీలైనంత తక్కువగా తీసుకోవాలి. వేపుళ్లకు దూరంగా ఉండాలి. చలికాలం లాగించినట్టు వేపుళ్లు తింటే జీర్ణ సంబంధ వ్యాధులు వస్తాయి.
మసాలాలు దట్టించిన ఆహారానికి కొంత దూరం పాటించండి. బిర్యానీలు, మసాలా కూరలను వీలైనంత తక్కువగా రుచి చూడండి. మసాలాలు శరీరంలో మరింత వేడిని పుట్టిస్తాయి.
అల్లం వాడకం కూడా తగ్గించాలి. అల్లంలోని యాంటీ ఆక్సిడెంట్స్ వేసవిలో శరీరానికి మేలు చేయవు. పోషకాల గనిగా పిలిచే అవిసె గింజలను కూడా తగ్గించాలి. వేసవిలో అవిసెగింజలు తినడం వల్ల రక్తపోటు పెరుగుతుంది.