TCS | ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ప్రభావంతో టెక్నాలజీ, ఐటీ, సాఫ్ట్ వేర్ సంస్థలు పొదుపు చర్యలు పాటిస్తూ, ఉద్యోగుల ఉద్వాసనకు పాల్పడుతుంటే.. దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్).. ఫ్రెషర్ హైరింగ్ ప్రాసెస్ ప్రారంభించింది. 2024లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఇంజినీర్లకు ఐటీ, బిజినెస్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు కల్పించేందుకు జాతీయ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. 2024-25 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో ఐటీ రంగం గ్రోత్ ప్రారంభం అవుతుందన్న అంచనాల మధ్య టీసీఎస్ ఫ్రెషర్ హైరింగ్ ప్రక్రియ చేపట్టడం గమనార్హం. అయితే, ఎంత మంది ఫ్రెషర్లను నియమించుకుంటుందన్న సంగతి వెల్లడించలేదు.
2024 గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థుల కోసం టీసీఎస్ నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్ (ఎన్క్యూటీ) ప్రారంభించింది. నింజా, డిజిటల్ ఫ్రెషర్ హైరింగ్, టీసీఎస్ ఆప్టిట్యూడ్, కోడింగ్ టెస్టుల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఇంజినీర్లు, కంప్యూటర్ గ్రాడ్యుయేట్లకు పిలుపునిచ్చింది. ఏప్రిల్ 10 లోగా దరఖాస్తు చేసుకోవాలని, 26న పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది.
ఆర్ట్స్, కామర్స్, సైన్స్ గ్రాడ్యుయేట్ల నుంచి టీసీఎస్ బిజినెస్ ప్రాసెసింగ్ స్పెషలిస్టుల (బీపీఎస్) ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఏప్రిల్ 14 లోపు అభ్యర్థులు తమ పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపింది. అండర్ గ్రాడ్యుయేట్లకు రూ.3-4 లక్షలు, పోస్ట్ గ్రాడ్యుయేట్లకు రూ.11-12 లక్షల మధ్య వార్షిక వేతన ప్యాకేజీ ఆఫర్ చేస్తున్నది. టెక్నాలజీ నైపుణ్యంతోపాటు జూనియర్, మిడ్ లెవల్ ప్రతిభావంతులను టీసీఎస్ తోపాటు ఇన్ఫోసిస్ కూడా కొద్ది మంది ఫ్రెషర్లను నియమించుకుంటుందని ఇటీవల వార్తలు వచ్చాయి.