జక్రాన్పల్లి, డిసెంబర్ 15: ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన ఓ కార్మికుడు అనారోగ్యంతో బాధపడుతుండగా తన సొంత ఖర్చులతో స్వగ్రామానికి రప్పించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం సికింద్రాపూర్కు చెందిన సాయికుమార్ ఉపాధి కోసం నాలుగేండ్ల క్రితం దుబాయ్ వెళ్లాడు. రెండు నెలల క్రితం ఆయనకు టీబీ సోకగా అక్కడి దవాఖానలో చేరాడు.
దేశం కాని దేశంలో అయినవారు ఎవరూ లేక మానసికంగా కుంగిపోయాడు. ఆరోగ్యం మరింత క్షీణించింది. సాయికుమార్ మిత్రులు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చేరవేశారు. మండల పరిషత్ ఉపాధ్యక్షుడు కుంచాల విమలారాజు, మాజీ ఎంపీపీ మైదం రాజన్న, సర్పంచ్ గంగామణి గంగాధర్ తదితరులు అతని పరిస్థితిని ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్కు వివరించారు. తక్షణమే స్పందించిన ఆయన విషయాన్ని ఎమ్మెల్సీ కవిత దృష్టికి తీసుకెళ్లారు. 15 రోజుల క్రితం నిజామాబాద్కు వచ్చిన ఎమ్మెల్సీ కవితను సైతం సాయికుమార్ కుటుంబ సభ్యులు కలిసి పరిస్థితిని వివరించారు.
స్పందించిన ఆమె తన సొంత ఖర్చులతో సాయికుమార్ను స్వగ్రామానికి రప్పించడమే కాకుండా ఆయన పనిచేసిన కంపెనీ నుంచి లబ్ధి కలిగేలా చొరవ తీసుకున్నారు. సాయికుమార్ను రప్పించే విషయంలో చొరవ తీసుకున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, సహకరించిన రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్కు సదరు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.