చెన్నై : ప్రియురాలి ఇంటికి వెళ్లిన ప్రియుడిని అత్యంత దారుణంగా చంపేశారు. ఈ దారుణ ఘటన తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో సోమవారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. 21 ఏండ్ల భారతీరాజా అనే యువకుడు.. పరమేశ్వరి(20) అనే యువతిని గత ఐదేండ్ల నుంచి ప్రేమిస్తున్నాడు. భారతీరాజా వృత్తిరీత్యా క్యాటరింగ్ పనులు చేసుకుంటున్నాడు. అయితే వీరి ప్రేమ విషయం యువతి ఇంట్లో తెలిసింది. దీంతో ఇద్దరి మధ్య సంబంధాలను తెంచేశారు. ఈ క్రమంలో యువతికి వేరొకరితో వివాహం చేయాలని ఆమె కుటుంబ సభ్యులు నిర్ణయించారు.
ఇక తన ప్రియుడు తనకు దక్కడం లేదని భావించిన సదరు యువతి.. మొత్తానికి భారతీరాజాకు సమాచారం చేరవేసింది. తీవ్ర ఆందోళనకు గురైన రాజా తన ఇద్దరు స్నేహితులతో కలిసి పరమేశ్వరి నివాసానికి చేరుకున్నాడు. రాజాను చూసిన యువతి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యారు. రాజాను చితకబాదారు. ఈ ఘటనను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అతన్ని పోలీసులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో పరమేశ్వరి తల్లిదండ్రులపై రాజా కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమారుడిని చంపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.