హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 3 (నమస్తే తెలంగాణ): ఆంధ్రోళ్లకు ఒక్క కాంట్రాక్టు కూడా ఇవ్వబోమని, ఆ విధంగా చట్టం తెస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అంటున్నాడని, సీఎంను ఒప్పించి ఆ చట్టం తెస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాల్ విసిరారు. బీజేపీ, టీడీపీ కలిసి మరోసారి తెలంగాణ మీద దాడి చేస్తున్నాయని, ఆంధ్రా కాంట్రాక్టర్లకు తెలంగాణలో ఒక్క ప్రాజెక్టు కూడా ఇవ్వబోమని, అవసరమైతే చట్టం తెస్తామని ప్రకటించిన మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలపై తలసాని ఘాటుగా స్పందించారు.
నగరంలోని సీతాఫల్మండిలో బుధవారం నిర్వహించిన సికింద్రాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణుల శిక్షణ కార్యక్రమంలో తలసాని మాట్లాడారు. కొందరు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు అహంకారం అంటున్నారని.. ‘మీ అయ్యను తిడితే నీకు కోపం రాదా?’ అని ప్రశ్నించారు. ఎవరు ప్రశ్నిస్తే వారిని లోపలేస్తున్నారని రేవంత్రెడ్డి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
గులాబీ జెండా కంటే ఏ పదవీ పెద్దది కాదని, సమయం కోసం వేచిచూడాలని సూచించారు. తాము ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశామని, కానీ రేవంత్రెడ్డి వాడే భాష ఎవరినుంచీ వినలేదని విమర్శించారు. ఎన్టీఆర్, చెన్నారెడ్డి, చంద్రబాబు, కిరణ్కుమార్రెడ్డి, రోశయ్య, కేసీఆర్ వంటి వారిని చూశామని, పేగులు తీసి మెడలో వేసుకుంటా.. తొండలు వదుల్తా.. గుడ్లు పీకి గోళీలాడుతా.. పండపెట్టి తొక్కుతా అన్న వారిని చూడలేదని చెప్పారు. ‘పండ పెట్టి తొక్కుతా అని మాత్రమే నువ్వు అంటున్నవ్.. కానీ మేము తొక్కి చూపిస్తాం’ అని హెచ్చరించారు. కేసీఆర్ తమకు మర్యాద నేర్పించారని, రాజ్యాంగబద్ధంగా ఉండాలని చెప్పారని గుర్తుచేశారు.