Garlic And Honey | వెల్లుల్లిని నిత్యం మనం వంటల్లో వేస్తుంటాం. వెల్లుల్లిని వేయడం వల్ల వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. మసాలా వంటకాల్లో వెల్లుల్లి వాడకం ఎక్కువగా ఉంటుంది. అలాగే తేనెను కూడా మనం తరచూ ఉపయోగిస్తూనే ఉంటాం. దీన్ని పలు పానీయాల్లో కలిపి తాగుతారు. అయితే వెల్లుల్లి, తేనె మిశ్రమాన్ని రోజూ తింటే అనేక లాభాలు కలుగుతాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. రోజూ ఉదయం పరగడుపునే రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలను కాస్త దంచి అందులో కాస్త తేనె కలిపి తినాలి. ఇలా రోజూ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. పలు వ్యాధులను నయం చేసుకునేందుకు ఈ మిశ్రమం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ మిశ్రమంలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి కనుక అనేక రోగాలను ఇది తగ్గిస్తుంది. మనల్ని అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉంచుతుంది.
వెల్లుల్లి తేనె మిశ్రమంలో అనేక సమ్మేళనాలు ఉంటాయి. ఇవి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. కనుక ఈ మిశ్రమాన్ని తింటే రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీని వల్ల ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. ముఖ్యంగా సీజనల్గా వచ్చే దగ్గు, జలుబు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. శ్వాసకోశ సమస్యలు తగ్గిపోతాయి. వెల్లుల్లి, తేనె మిశ్రమాన్ని తింటే గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇది బీపీ, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. దీని వల్ల రక్త నాళాలు గట్టి పడకుండా ఆరోగ్యంగా ఉంటాయి. రక్త సరఫరా మెరుగు పడుతుంది. రక్త నాళాల్లో ఉండే క్లాట్స్ కరిగిపోతాయి. దీంతో గుండె జబ్బులు రావు. ముఖ్యంగా హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు.
వెల్లుల్లి, తేనె మిశ్రమాన్ని తింటే జీర్ణ వ్యవస్థలో ఉండే ఎంజైమ్ల ఉత్పత్తి పెరుగుతుంది. దీని వల్ల మనం తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. దీంతో పోషకాహార లోపం ఉండదు. ఈ మిశ్రమం సహజసిద్ధమైన ప్రీ బయోటిక్ ఆహారంగా కూడా పనిచేస్తుంది. అంటే దీన్ని తింటే జీర్ణ వ్యవస్థలో ఉండే మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. ముఖ్యంగా కడుపు ఉబ్బరం, అజీర్తి ఉన్నవారికి మేలు జరుగుతుంది. ఈ మిశ్రమంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఇన్ ఫ్లామేటరీ కారకాలుగా కూడా పనిచేస్తాయి. అందువల్ల దీన్ని తింటే శరీరం లోపల, బయట తీవ్రంగా ఉండే వాపులు సైతం తగ్గిపోతాయి. ఆర్థరైటిస్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది.
వెల్లుల్లి, తేనె మిశ్రమం సహజసిద్ధమైన డిటాక్సిఫయర్ గా కూడా పనిచేస్తుంది. దీన్ని తింటే శరీరంలోని వ్యర్థాలు సులభంగా బయటకు వెళ్లిపోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. లివర్ పనితీరు మెరుగు పడుతుంది. లివర్లో ఉండే టాక్సిన్లు బయటకు పోయి లివర్ క్లీన్ అవుతుంది. లివర్ సమస్యలు ఉన్నవారికి ఈ మిశ్రమం ఎంతో మేలు చేస్తుంది. ఈ మిశ్రమాన్ని ఉదయం తింటే శరీరానికి శక్తి లభించి ఉత్సాహంగా మారుతారు. యాక్టివ్గా ఉంటారు. శరీరంలో రోజంతా శక్తి స్థాయిలు అధికంగా ఉంటాయి. నీరసం, అలసట ఉండవు. వెల్లుల్లిని ఇలా తినడం ఇష్టం లేకపోతే దాని నుంచి రసం తీసి అందులో తేనె కలిపి తాగవచ్చు. లేదా వెల్లుల్లి రెబ్బలను నీటిలో వేసి మరిగించి ఆ నీటిలో తేనె కలిపి కూడా తీసుకోవచ్చు. ఇలా ఈ మిశ్రమాన్ని తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది.