దుబాయ్: ఆస్ట్రేలియా వేదికగా వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ మంగళవారం అధికారికంగా ఖరారైంది. 2022 అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు జరిగే మెగాటోర్నీకి ఏడు నగరాలు ఆతిథ్యమివ్వబోతున్నాయి. మొత్తం 45 మ్యాచ్లు మెల్బోర్న్, సిడ్నీ, బ్రిస్బేన్, పెర్త్, అడిలైడ్, గీలాంగ్, హోబర్ట్ వేదికలుగా జరుగుతాయని ఐసీసీ పేర్కొంది. అడిలైడ్, సిడ్నీలో సెమీఫైనల్ జరుగనుండగా, మెల్బోర్న్ ఫైనల్ పోరుకు ఆతిథ్యమివ్వనుంది. డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో పాటు రన్నరప్ న్యూజిలాండ్, భారత్, అఫ్గనిస్థాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా నేరుగా సూపర్-12కు అర్హత సాధించాయి. రెండు సార్లు చాంపియన్ వెస్టిండీస్, నమీబియా, స్కాట్లాండ్, శ్రీలంక..రౌండ్-1లో ఆడుతాయి. ఒమన్, జింబాబ్వేలో జరిగే వేర్వేరు అర్హత టోర్నీల ద్వారా నాలుగు జట్లు 2022 పొట్టి ప్రపంచకప్ టోర్నీకి బెర్తులు దక్కించుకుంటాయి.