యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం పునఃప్రారంభానికి సిద్ధమవుతున్నది. ఆరున్నరేండ్లుగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కోట్లాది భక్తులకు ఈ నెల 28న స్వంభువుల దర్శన భాగ్యం కలుగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్, వేదపండితుల నిర్ణయించిన ముహూర్తం మేరకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 21నుంచి 28 వరకు మహాకుంభ సంప్రోక్షణ నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధానార్చకుడు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహా చార్యులు వెల్లడించారు. 21న సంప్రోక్షణ స్నపన, మృత్సంగ్రహణం, అంకురారోపణంతో ఉద్ఘాటన పర్వాలు ప్రారంభం కానుండగా బాలాలయంలో వైభవంగా పంచకుండాత్మక మహాయాగం చేపట్టనున్నట్లు చెప్పారు.
కానున్నది. ఈ నెల 21న సంప్రోక్షణ, స్నపనం, మృత్సంగ్రహణం, అంకురారోపణంతో ప్రారంభమై 28న మహాకుంభ సంప్రోక్షణతో ప్రధానాలయం పునఃప్రారంభం కానున్నదని అర్చకులు తెలిపారు. మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా ఈ నెల 21న ఉదయం స్వామి వారికి ఉత్సవాంగ, ప్రతిష్ఠాంగ సంప్రోక్షణ, స్నపనం నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి స్వస్తీ వాచనం అత్యంత వైభవోపేతంగా చేపడుతారు. సాయంత్రం మృత్సంగ్రహణం, అంకురారోపణం నిర్వహిస్తారు. 22న ఉదయం అగ్ని మథనం, యాగశాల ప్రవేశం, ఆలయ పునర్నిర్మాణంలో ఉండే సమస్త వాస్తు దోషాలు, క్షేత్రదోషాలు తొలగిపోవడానికి ‘మహావాస్తు శాంతి పూజ’ ను నిర్వహిస్తారు. ఇది అతి శక్తివంతమైన, బలమైన పూజా కార్యక్రమం అని ఆలయ ప్రధానార్చాకుడు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు వెల్లడించారు. ప్రతి రోజూ సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణం ఉంటుందని
తెలిపారు.
మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా రోజూ యాగశాలలో మూలమంత్ర, మూర్తి మంత్ర జపాలు, హవన విధివిధానాలు జరుగుతూ ఉంటాయి. ఉదయం, సాయంత్రం ప్రత్యేకమైన హోమాలు నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలను సారం యాదాద్రీశుడికి సుమారుగా 11 కోట్ల లక్ష్మీనృసింహ మూల మంత్ర, మూర్తి మంత్ర జపాలను నిర్వహించాలని ఆలయ ప్రధానార్చకత్వం సంకల్పించింది. నెలకు ఒక కోటి జపం చేపట్టాలని ప్రత్యేకమైన ప్రాజెక్టును నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ మూల మంత్ర, మూర్తి మంత్ర జపాలన్నీ కూడా మూడున్నర సంవత్సరాలుగా కొనసాగుతున్నాయని ప్రధానార్చకులు వివరించారు. ఇప్పటివరకు 8 కోట్ల జపం పూర్తయినట్లు వెల్లడించారు. మొత్తంగా 11 కోట్ల జపం చేయాలన్నది మహా సంకల్పం అని తెలిపారు. సంకల్పానికి వికల్పం లేకుండా 108 మంది రుత్విక్కులతో జపం చేయిస్తున్నామని వివరించారు. 11 కోట్ల లక్ష్మీనృసింహ మూలమంత్ర జపం చేయించడమే ఈ యజ్ఞంలోని మహావిశేషం. దాంతో యంత్రాలకు మహాబలం చేకూరుతుంది. ఈ యంత్ర బలంతోనే భక్తులకు స్వామివారు అభయ వరప్రదానం చేస్తారు.
ప్రధానాలయ పునః ప్రారంభంలో భాగంగా చివరిరోజైన 28వ తేదీన స్వామివారి దివ్య విమాన శిఖరానికి కుంభ సంప్రోక్షణాభిషేక మహాసంకల్పం చేసి, ఉదయం 11.55 గంటలకు మిథునలగ్న సుముహూర్తాన భక్తులకు యాదాద్రి దేవస్థానాన్ని అంకితమిస్తారని ఆలయ ప్రధానార్చకులు తెలిపారు. ‘తెలంగాణతో పాటు ఇతర రాష్ర్టాలకూ ఎవ్వరూ ఇవ్వలేని గొప్ప భక్తి కానుక ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవ్వబోతున్నారు.. ప్రజలందరికీ స్వయంభువుల దివ్య దర్శనాన్ని ఆపాదింపజేస్తారు. కృష్ణశిలలతో నాణ్యతతో దర్శనీయంగా ప్రతిష్ఠా కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతాయి’ అని ప్రధానార్చకులు వెల్లడించారు. మంత్రము అనేది మహాప్రయోగంగా జరుగుతుంది. పరమ ప్రశాంతంగా, శక్తివంతంగా, మంత్రశక్తి సమన్వితంగా ప్రతిష్ఠాపన జరుగుతుందని అర్చకులు అభిప్రాయపడ్డారు. ప్రజలకు యాదాద్రి దేవాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ పునరంకితం చేస్తారని వివరించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం స్వామివారికి ఏ లోటూ లేకుండా, ఆర్భాటాలు లేకుండా, ప్రధాన కైంకర్యాలు ద్విగుణీకృతంగా, శతకృత అభివృద్ధిగా వంద రెట్లు మంత్రశక్తి సమన్వితంగా ఉత్సవాలను జరిపిస్తామని ప్రధానార్చకులు వివరించారు. నరసింహస్వామివారిపై సీఎం కేసీఆర్కు ఉన్న భక్తి మరోసారి నిరూపితమైందన్నారు. సీఎం కేసీఆర్ను ముఖ్యమంత్రిగానే కాకుండా అభినవ ప్రహ్లాదుడుగా భావిస్తాం. ప్రహ్లాదతత్వం ఉంటేనే నరసింహస్వామివారు వశీకరమవుతారు. ప్రహ్లాద శబ్దానికే ప్రక్లుష్టేనా ఆహ్లాదం ప్రహ్లాదం అని పేరు. ప్రహ్లాద స్వరూపం ముఖ్యమంత్రి కేసీఆర్ అని పేర్కొన్నారు.
ప్రధానాలయం పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ నెల 17నుంచి బాలాలయంలో ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నాం. భక్తులతో నిర్వహించే సుదర్శన నరసింహహోమం, కల్యాణోత్సవం, స్వామివారి జోడు సేవలను నిలిపివేశాం. స్వామివారి పంచకుండాత్మక మహాయాగం బాలాలయంలోనే చేపట్టాల్సి ఉన్నందున ఏర్పాట్లు చేస్తున్నాం. స్వామివారి కల్యాణోత్సవం, సుదర్శన నరసింహ హోమం జోడు సేవలను పాతగుట్టలో నిర్వహిస్తాం. భక్తులు సద్వినియోగించుకోవాలి.
– ఎన్. గీత, ఈఓ, యాదాద్రి దేవస్థానం
బాలాలయంలోని యాగశాలలో పంచకుండాత్మక మహాయాగం నిర్వహిస్తామని ప్రధానార్చకులు తెలిపారు. వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ్ద, మహాలక్ష్మీ అనే యజ్ఞకుండాలతో స్వాహాకార యజ్ఞం నిర్వహిస్తామన్నారు. దీనిని ఆగమశాస్త్రం బిగి, జిగి, విధి, విధానంగా అభివర్ణిస్తారని వివరించారు. స్వామివారిని బింబం, కుంభం, చక్రాబ్ది మండల, అగ్ని ఆవాహనం చేస్తూ చతుస్థానార్చన కార్యక్రమం చేపడుతామన్నారు. ఇది చాలా గొప్ప పూజ అని పేర్కొన్నారు.
మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా రోజూ అధివాస కార్యక్రమం ఉంటుందని ప్రధానార్చకులు వివరించారు. తొలి రోజు ప్రతిష్ఠా విగ్రహాలు, మూర్తులకు మానోన్మాన పరీక్ష, మృత్తికా అధివాసం చేపడుతారు. నవ కలశ అభిషేకాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా తొలి రోజున 9 కలశాలు ఆ తర్వాత వరుసగా 16, 25, 108, 1000 కలశాలతో అభిషేకాలు నిర్వహించనున్నారు. ధాన్యాధివాసం, జలాధివాసం కార్యక్రమాలు నిర్వహిస్తారు. పాంచరాత్రాగమశాస్త్రం, భగవద్ రామానుజ సంప్రదాయ ప్రకారం ప్రధానార్చకత్వంలో, కార్యనిర్వహణాధికారి ఆధ్వర్యంలో విశిష్టమైన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రధానార్చకులు తెలిపారు.
యజ్ఞశాల ప్రధాన వేదికలో మహామూర్తి కుంభస్థాపన, సప్త గోపురాలకు ప్రత్యేక మహాకుంభాభిషేకానికి కుంభస్థాపనలు, బంగారు కలశంతో ప్రధానమైన కుంభం. ఆ కుంభంలో లక్ష్మీనరసింహస్వామిని ఆవాహనం చేస్తామని ప్రధానార్చకులు తెలిపారు. ఒక్కో కుంభంలో గాలిగోపురంలోఉన్న దేవతలను ఆవాహనం చేస్తామన్నారు. దివ్యవిమానానికి మహాసుదర్శన ఆవాహన, సప్త రాజగోపురాలకు అధిష్ఠాన దేవతల ఆవాహనం చేపడుతామని పేర్కొన్నారు.