సూర్యాపేట, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని మరోమారు స్పష్టమైందని మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రం లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లా దాహార్తిని తీర్చడంతోపాటు ఆపత్కాలంలో విద్యుత్ అవసరాన్ని తీర్చే టెయిల్పాండ్ నీటిని ఏపీ అడ్డదారుల్లో ఖాళీ చేస్తుంటే ముఖ్యమంత్రి సహా జిల్లా మంత్రులకు సోయి లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ నిర్వాకంతో నల్లగొండ జిల్లా మరోసారి ఫ్లోరైడ్ రక్కసికి బలయ్యే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నాలుగేండ్ల కాలంలోనే మిషన్ భగీరథ నీటితో ఫ్లోరైడ్ మహమ్మారిని పూర్తిగా తరిమికొడితే, మార్పు తెస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఫ్లోరైడ్ మహమ్మారిని తిరిగి తెప్పిస్తున్నదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఫోర్ట్వంటీ హామీలిచ్చి కనీసం ఒక్కటి కూడా అమలు చేయకపోగా, పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను కూడా కొనసాగించడం లేదని మండిపడ్డారు. సమైక్య నాయకుల తొత్తు ప్రభుత్వం ఇక్కడ నడుస్తున్నదని, వారికి సంతోషాన్నిచ్చేలా వీరి పాలన సాగుతున్నదని ఆరోపించారు. ఇక్కడి ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచన కొంచెం కూడా లేదని విమర్శించారు.
లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్ నాయకులను నీటి చౌర్యంపై నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. టెయిల్పాండ్ నీటి విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే మరో ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, పార్లమెంట్ ఎన్నికల సూర్యాపేట నియోజకవర్గ ఇన్చార్జి రాంచంద్రనాయక్, మారిపెద్ది శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు.