బొడ్రాయిబజార్, నవంబర్ 10 : కేంద్ర ప్రభుత్వం సామాన్య, మధ్య తరగతి ప్రజల సంక్షేమాన్ని విస్మరించి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచుతుండడంతో చిరు వ్యాపారుల పరిస్థితి దయనీయంగా మారుతున్నది. వ్యాపారం మానుకోలేక మనుగడ కొనసాగించలేక సతమతమవుతున్నారు. అసలే కరోనా రక్కసితో వ్యాపారాలు దెబ్బతినగా పెరిగిన ధరలతో రోజు కూలి కూడా గిట్టుబాటు కాకపోవడంతో చిరు వ్యాపారులు తీవ్ర ఆవేదన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అల్పాహారమైన ఇడ్లీ, దోశ, మిర్చి బండ్లు నిర్వహించే వ్యాపారులు పెరిగిన ధరలకు అనుగుణంగా రేట్లు పెంచితే వ్యాపారం దెబ్బ తింటుందేమోనన్న భయంతో నష్టాల్లోనే వ్యాపారం కొనసాగిస్తున్నారు. రెండేండ్లుగా ప్రజలు ఆర్థికంగా చిక్కి శల్యమవుతున్న తరుణంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరు మరింత ఆవేదనకు గురి చేస్తున్నది.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఒకే సారి రూ.270 పెంచింది. ఇది చిరు వ్యాపారులకు గుదిబండగా మారింది. అసలే కరోనాతో వ్యాపారం అంతంతమాత్రమే ఉండగా సిలిండర్ ధర పెంపు, నిత్యావసర సరకుల ధర పెరగడంతో వారి పరిస్థితి అధ్వానంగా తయారైంది. రోజుకు ఇద్దరు వర్కర్లకు రూ.1200 ఖర్చు అవుతుండగా పెట్టుబడి పోను కూలి మాత్రమే మిగులుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దోశ, ఇడ్లీ, బొండ, గారె, మిర్చి వంటి పదార్థాలు ఎక్కువగా ప్రజలు వేడి వేడిగా కోరుకుంటారు. ఈ పదార్థాలను ఎప్పుడూ వేడిగా ఉంచాలంటే గ్యాస్ స్టవ్ ఎప్పుడు ఆన్లోనే ఉండాల్సి ఉంటుంది. దీంతో రోజుకు సిలిండర్కు రూ.2,250 చెల్లించాల్సి వస్తుండగా డబ్బులు సగం గ్యాస్కే పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్, నిత్యావసర ధర పెరగడంతో ఆహార పదార్థాల రేట్లు పెంచలేక, వ్యాపారం మానుకోలేక తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.
గ్యాస్ ధర పెంపుతో మరింత భారం..
రోజువారీగా తయారీకి అవసరమయ్యే సరుకుల ధరలు పెరిగాయి. అదే రీతిలో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచడంతో హోటళ్లు నడిపించడం మరింత భారంగా మారింది. హోటల్ నిర్వహణకు పలు ఇబ్బందులు ఎదురవుతున్నా తప్పని పరిస్థితిలో హోటల్ను నడిపిస్తున్నాం. ధరలు పెరుగుతూ పోతే హోటల్కు గిరాకీ తగ్గి బతుకు భారంగా మారుతుంది. ధరల తగ్గింపునకు చర్యలు తీసుకోవాలి.
ధరలు పెంచలేం..వ్యాపారం మానుకోలేం
పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు భారంగా మారాయి. కరోనాకు ముందు వ్యాపారం బాగా సాగింది. ప్రస్తుతం కొద్దిగా పుంజుకుంటున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం పెంచుతున్న ధరలతో వ్యాపారాలు నిర్వహించే పరిస్థితి లేదు. లాభం రావాలంటే రేటు పెంచడం తప్ప మరో మార్గం లేదు. రేటు పెంచితే వ్యాపారం దెబ్బ తింటుందని భయంగా ఉంది.. ఇది తప్ప వేరే పని చేయలేక దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాము. ధరలను తగ్గిస్తే బాగుంటుంది.
గ్యాస్ ధర తగ్గించాలి
గ్యాస్ సిలిండర్ ధర రూ.270 పెంచడంతో మాలాంటి చిరు వ్యాపారులపై భారం పడుతున్నది..ఉపాధి కోసం హోటల్ నడుపుతున్నా. కొవిడ్తో గతేడాది వ్యాపారం సజావుగా జరగలేదు. ఇప్పుడు సిలిండర్ ధర పెంచడంతో నెలకు రూ.1500 అదనంగా చెల్లించాల్సి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం ధరలు తగ్గించి చిరువ్యాపారులను ఆదుకోవాలి.