జిన్నారం, డిసెంబర్ 5 : బెట్టింగ్ పలు రకాలుగా జరుగుతూనే ఉంది. ఐపీఎల్తో గ్రామాల్లో జోరందుకున్న బెట్టింగ్లు ఇప్పుడు కొత్తరకంగా జరుగుతున్నాయి. అప్పుడప్పుడు సరదాగా కాసే బెట్టింగ్లు ఇప్పుడు ఇదే వృత్తిగా నిర్వహిస్తున్నారు. చిత్తు బొత్తు, పేకాట ఇప్పుడు జిన్నారం మండలంలో జోరుగా జరుగుతున్నది. ప్రధానంగా రాళ్లకత్వ, సోలక్పల్లి తదితర గ్రామ శివార్లలో జరుగుతున్నాయి. రోజుకూ రూ.లక్షల చేతులు మారుతున్నాయి. రోజుకో అడ్డాలో పకడ్బందీగా ఆటలు నిర్వహిస్తున్నారు. పరిశ్రమల్లో పనిచేసే దినసరి కూలీలు, ఆటోలు నడుపుకొని జీవనం సాగించే వారితో పాటు రియల్ వ్యాపారులు, సమాజంలో డబ్బు, పేరు ఉన్న బడాబాబులు చిత్తు బొత్తు, పేకాట ఆడుతున్నారు. దీంతో రూ.వేలు, లక్షలు పోగొట్టుకొని మధ్య, కింది తరగతి కుటుంబాలు అప్పుల పాలవుతున్నారు.
గ్రామ శివారులు, గెస్ట్ హౌస్ ప్రాంతాలే అడ్డాలు..
జన సంచారం తక్కువగా ఉండే గ్రామ శివారులు, గెస్ట్హౌజ్లు, ఫాంహౌస్ ప్రాంతాలే చిత్తుబొత్తు, పేకాట స్థావరాలు. రోజుకో వీరి అడ్డాలు మారుతున్నాయి. పోలీసులకు దొరకకుండా ఉండేదుకు దూరపు ప్రాంతాలు, ప్రముఖుల వ్యవసాయ క్షేత్రాలు ఆట స్థావరాలుగా మార్చుకుంటున్నారు. రూపాయి చిక్కతో చిత్తుబొత్తు ఆట ఆడేస్తున్నారు. చిత్తుబొత్తు, పేకాటలో లక్షల పందెం కాస్తున్నా నగదు రహితంగా అంతా ఫోన్పే, గూగుల్ పే లాంటి ఆన్లైన్ పంపకాలు జరుగుతున్నాయి. చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకొని ఆటలు ఆడుతున్నారు. అనుమానం వచ్చినట్లుగా గుర్తిస్తే కొన్ని రోజుల పాటు ఆటలు నిర్వహించడం లేదు. పోలీసుల నిఘాకు దొరకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామ ప్రధాన చౌరస్తాల్లో తమ మనుషులను ఏర్పాటు చేసుకుంటున్నారు. పోలీసులు, కొత్త వ్యక్తులు గ్రామాలకు వచ్చినా, పొలాల వైపు వచ్చినా వెంటనే సమాచారం వెళ్తున్నది. క్షణం ఆలస్యం చేయకుండా అక్కడున్న వారంతా తలా ఒకవైపు జారుకుంటారు. ఒకవేళ ఎవరైనా అడిగితే పొలం వద్ద నుంచి వస్తున్నానని సులువుగా తప్పించుకుంటున్నారు. దీంతో నిజంగా పొలాల వద్దకు వెళ్లే రైతులను అనుమానిస్తున్నారు. గతంలో పోలీసులు పేకాట, చిత్తుబొత్తు ఆడే స్థావరాలపై దాడులు చేసేందుకు వెళ్లగా బైకులు, కార్లు వదిలి పారిపోయిన సందర్భాలు ఉన్నాయి.
రూ. లక్షల్లో ఆట.. రోడ్డున పడుతున్న కుటుంబాలు
ప్రస్తుతం పేకాట కంటే కూడా చిత్తుబొత్తు ఆటను ఎక్కువగా ఆడుతున్నారు. నిమిషంలో పూర్తయి, రూ.లక్షల్లో చేతులు మారి క్షణాల్లో మనిషి జీవితాన్ని తలకిందులు చేస్తున్న ఆట చిత్తుబొత్తు. చిత్తువైపు ఐదుగురు, బొత్తు వైపు ఆరు, ఏడుగురు ఇలా పందెం కాస్తున్నారు. తక్కువలో తక్కువ ఒక్కొక్కరు రూ.50 వేల నుంచి రెండు లక్షల వరకు చిత్తుబొత్తులో ఆడుతున్నారు. ఆట ముగిసే సమయానికి ఎవరికి ఎంత రావాలో లెక్కలు చూసుకొని ఆన్లైన్లో నగదు బదిలీ చేసుకుంటున్నారు. ఈ ఆటలో చాలా మంది నష్టపోతున్న వారే ఎక్కువ. దీంతో నష్టపోయిన కుటుంబాల సంసారాలు ఛిద్రమవుతున్నాయి. కలహాలు, గొడవలతో రోడ్డున పడుతున్నారు. జరిగిన నష్టం నుంచి కోలుకోలేక ఉపాధి కోసం కొందరు ఊరు మారుతున్నారు. కొందరికీ బంధువులు, స్నేహితులు ఆర్థిక సాయం చేసి సంసారాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
నిఘాతోనే అడ్డుకట్ట
చిత్తుబొత్తు, పేకాటను అరికట్టేందుకు పటిష్ట నిఘాను ఏర్పాటు చేయాలంటున్నారు ఈ ఆటలో నష్టపోయిన కుటుంబీకులు, గ్రామస్తులు. చుట్టు పక్క గ్రామాల శివారులే కాకుండా దూర ప్రాంతాల శివార్లలోనూ చిత్తుబొత్తు ఆట ఆడుతున్నారు. పొద్దున్న ఇంటి నుంచి వెళ్తే రాత్రికి ఇంటికి వస్తున్నారు. ఇల్లు, భార్య, పిల్లల పట్టింపులు ఉండ డం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల భవిష్యత్ ఎట్ల అని ఓ మహిళ కండ్లనిండా నీళ్లు తెచ్చుకుంది. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న ఓ వ్యక్తి చిత్తుబొత్తు ఆడి ఆటోను అమ్ముకున్నాడు. బిడ్డ పెండ్లి కోసం చేయించిన బం గారం ఎత్తుకెళ్లి ఓ కొడుకు చిత్తు బొత్తు ఓడిపోయి కుటుంబానే ఆగం చేశాడని గతంలో జరిగిన కొన్ని సంఘటనలు వివరించారు.
కారకులపై చర్యలు తీసుకుంటాం
చిత్తుబొత్తు, పేకాట, గంజా యి సరఫరా చట్ట వ్యతిరేకం. వీటిపై కఠిన నిఘా ఏర్పా టు చేశాం. పేకాట, చిత్తు బొత్తు ఆటపై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు, సమాచారం రాలేదు. దీనిపై మరింత దృష్టి సారిస్తాం. ఆటలు ఆడే స్థావరాలను గుర్తించి, కారకులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము.
-రాజశేఖర్, ఎస్సై, జిన్నారం