న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు ఆదేశాలను బుల్డోజ్ చేయవద్దు అంటూ ఇవాళ సీపీఐ నేత బృందా కారత్ కోరారు. ఢిల్లీలోని జహంగిర్పురిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతను అడ్డుకునేందుకు బృందా కారత్ ప్రయత్నించారు. షాపుల కూల్చివేతను నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలను ఇచ్చిందని, 10.45 నిమిషాలకు కోర్టు ఆ ఆదేశాలను వెలువరించిందని, ఆ ఆదేశాలు అమలు అవుతున్నాయో లేదా చూసేందుకు జహంగిర్పురికి వచ్చినట్లు ఆమె తెలిపారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతతో చట్టాన్ని, రాజ్యాంగాన్ని బుల్డోజ్ చేశారని బృందా ఆరోపించారు. కనీసం సుప్రీంకోర్టు, ఆ కోర్టు ఆదేశాలను బుల్డోజ్ చేయవద్దు అంటూ ఆమె కోరారు. స్టే ఇచ్చినా కూల్చివేత కొనసాగుతున్నట్లు సుప్రీంకు మరోసారి సీనియర్ అడ్వకేట్ దుశ్యంత్ దవే విన్నవించారు. ఆ సమయంలో సీజేఐ స్పందిస్తూ.. స్టే ఆదేశాలను నార్త్ ఢిల్లీ మేయర్కు చేరవేయాలని సుప్రీం రిజిస్ట్రీని ఆదేశించారు.