కొవాగ్జిన్ వేసుకున్నవారికి మళ్లీ కొవిషీల్డ్ ఇవ్వాలన్న పిటిషన్పై సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, అక్టోబర్ 29: విదేశాలకు వెళ్లేందుకుగానూ కొవాగ్జిన్ టీకా తీసుకున్నవారికి మళ్లీ కొవిషీల్డ్ వ్యాక్సిన్ వేయాలని కేంద్రాన్ని ఆదేశించలేమని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. కొవాగ్జిన్కు డబ్ల్యూహెచ్వో అనుమతి ఇంకా లభించలేదని, దీంతో బయటి దేశాలకు వెళ్లాలనుకుంటున్న వారికి అడ్డంకులు ఏర్పడుతున్నాయని పేర్కొంటూ అత్యున్నత న్యాయస్థానంలో ఓ పిటిషన్ దాఖలైంది. కొవాగ్జిన్ టీకా వేసుకున్నవారికి ‘కొవిషీల్డ్’ టీకా వేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషనర్లు పేర్కొన్నారు. దీనిపై శుక్రవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ‘కొవాగ్జిన్’కు సంబంధించిన సమాచారాన్ని భారత్ బయోటెక్ ఇప్పటికే డబ్ల్యూహెచ్వోకు సమర్పించిందని, నిర్ణయం వచ్చేవరకు వేచిచూడాలని పేర్కొంది. దీపావళి అనంతరం పిటిషన్పై విచారణ చేపడుతామన్నది.