గుండె, కాలేయం, కిడ్నీ, ఆర్థో తదితర వ్యాధుల చికిత్స కోసం ఉస్మానియా, గాంధీ, నిమ్స్ లాంటి ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ వైద్యశాలలకు వెళ్తున్నారా? ఇక అవసరం లేదు. సూపర్ స్పెషాలిటీ దవాఖానల్లో అందే సేవలన్నీ అందుబాటులోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ వైద్యశాల్లలోనే పొందవచ్చు.
ప్రతి రోగికి 15 నిమిషాల సమయం..
టెలీ మెడిసిన్ ద్వారా ప్రతి రోగికి 15 నిమిషాల సమయం కేటాయిస్తారు. ఈ సమయంలో రోగి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేరుగా సూపర్ స్పెషాలిటీ వైద్యులతో మాట్లాడవచ్చు. కన్సల్టేషన్ పూర్తి అయిన తర్వాత వెంటనే వైద్య పరీక్షలు, మందులకు సంబంధించిన ప్రిస్కిప్షన్ ఆన్లైన్ ద్వారా సదరు యూపీహెచ్సీ లేదా బస్తీ దవాఖానకు వెళ్తుంది. అక్కడి సిబ్బంది దాన్ని ప్రింట్ తీసి రోగులకు ఇస్తారు. అవసరమైన వైద్య పరీక్షలను అక్కడే ఉచితంగా నిర్వహిస్తారు.
ఉచితంగానే స్పెషల్ సేవలు..
ఖరీదైన సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను రోగులకు ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ సర్కార్ హైదరాబాద్ నగర పరిధిలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో టెలీమెడిసిన్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. అంతేకాక బస్తీ దవాఖానలకు సైతం ఈ సేవలను విస్తరించింది. ఉస్మానియా, గాంధీ, నిమ్స్ లాంటి సూపర్ స్పెషాలిటీ వైద్యశాలలకు వెళ్లిన వారికి అక్కడ నిరీక్షణ తప్పదు. ప్రైవేట్కు వెళ్తే నిలువు దోపిడీకి గురవుతున్నారు. మరికొందరు వివిధ కారణాలతో ఆరోగ్య సమస్యను ప్రారంభ దశలో నిర్లక్ష్యం చేసి పరిస్థితి విషమించిన తర్వాత ట్రెషరీ దవాఖానలకు పరుగులు తీస్తున్నారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను మరింత చేరువ చేయాలని నిశ్చయించి కార్పొరేట్ తరహాలో యూపీహెచ్సీలలో టెలీ మెడిసిన్ను ప్రారంభించింది. నగరంలో మొత్తం 89 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండగా ఇందులో 85 యూపీహెచ్సీలు, 40 బస్తీ దవాఖానల్లో టెలీమెడిసిన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు బస్తీదవాఖానలు, టెలీమెడిసిన్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రుక్మారెడ్డి తెలిపారు.
సేవలు ఇలా..
రోగులు ముందుగా దగ్గర్లోని యూపీహెచ్సీ లేదా టెలీ మెడిసిన్ అందుబాటులో ఉన్న బస్తీ దవాఖానకు వెళ్లి తన పేరును నమోదు చేయించుకోవాలి. అనంతరం అక్కడి సిబ్బంది రోగితో పాటు వ్యాధికి సంబంధించి పూర్తి వివరాలను ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులో పొందుపరుస్తారు. ఈ వివరాలన్నీ ఆన్లైన్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొనే కన్సల్టేషన్ వైద్యుడి వద్దకు వెళ్తాయి. అనంతరం వాటిని పరిశీలించిన వైద్యులు రోగులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి సమస్యను పరిష్కరిస్తారు.
ప్రతి వారం 20 వైద్యశాలలకు విస్తరిస్తున్నాం..
ఖరీదైన సూపర్ స్పెషాలిటీ సేవలు పొందాలంటే కార్పొరేట్లో లక్షలు ఖర్చవుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్న రోగులు నిమ్స్, ఉస్మానియా, గాంధీ లాంటి వైద్యశాలలను ఆశ్రయిస్తూ ఇబ్బంది పడుతున్నారు. ప్రతి నిరుపేద రోగికి సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం సంకల్పించింది. నగరంలోని 85 యూపీహెచ్సీలు, 40 బస్తీ దవాఖానల్లో టెలీ మెడిసిన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాం. గతంలోనే యూపీహెచ్సీల్లో ఈ సేవలు ప్రారంభం కాగా.. రెండు వారాల నుంచి బస్తీ దవాఖానల్లో విస్తరించాం. ప్రతి వారం 20 బస్తీ దవాఖానలకు టెలీ మెడిసిన్ సేవలను విస్తరిస్తున్నాం. నగరంలో మొత్తం 133 బస్తీ దవాఖానలుంటే అందులో ప్రస్తుతం 40 వైద్యశాలల్లో టెలీ మెడిసిన్ సేవలు అందుబాటులోకి తెచ్చాం. వారానికి 20 చొప్పున అన్ని బస్తీ దవాఖానల్లో అమలు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించాం.