తెట్టన తెల్లారింది. మబ్బులనే చెట్టుమీద పడ్డ మంచు, పొద్దున సూర్యుని కిరణాలతోని ముత్యం లెక్క మెరుస్తున్నది.
చిన్న మంగళారం ఊరు మబ్బులనే నిద్ర లేచింది.
రాజవ్వ.. హోటల్ ముందటున్న చెత్తను ఊడ్చేసి, చీపురు పుల్లల్ని మంచిగ చేసి ఎప్పటి
లెక్కనే మూలకు పెట్టింది.
“రాజవ్వ, ఓ రాజవ్వ.. యాడున్నవ్!” అని లాశిగ అంటున్న మొగని మాట విని,
“ఆకిలి ఊడ్చి కట్టెల పొయ్యి ముట్టిత్తున్న. నువ్వు మంచం దిగవా!” అని బెదిరించినట్టే మొగనికి జవాబిచ్చింది.
మెల్లెమెల్లగ నాగండ్లు ఊరుదాటి పొలం తొవ్వ వడుతున్నయి. కొందరు చాయ్ తాగనీకి రాజవ్వ హోటల్ కట్టె బేంచీల మీద కూర్చున్నరు. నిన్నటి పేపర్ల తలకాయపెట్టిన ఆగమయ్య నోట్ల నోట్లనే ఏదో అనుకుంటుంటే..
పక్కనే కూసొని చాయ్ తాగుతున్న కిష్టయ్య..
“ఏందోయ్ ఎన్నడులేంది కొత్తగ పేపర్ చదువుతున్నవ్” అని అడిగిండు.
“పేపర్ సదువనీకి కొత్త, పాతేందే కిష్టయ్య మామా! అండ్లున్న ముచ్చట కొత్తగనిపిస్తె సదువుతం. అండ్ల ఏముందో చెప్తున్న ఇను. ఎవుసం దండుగనట. వరి గాకుంట పత్తి, పొగాకసొంటి పంటలు ఏసుకోమని పుక్యానికొచ్చిన సలహా ఇస్తున్నడు.. మామను దించి గద్దెనెక్కిన కొత్త ముఖ్యమంత్రి. ఇగో సూడు” అనుకుంట పేపర్ల వచ్చిన వార్తను కిష్టయ్యకు చూపిచ్చిండు.
“ఆయ్నగుడా వ్యవసాయం చేసినోడు కదనోయ్ అల్లుడూ! మరి గిట్లెందుకు అంటుండో మరి!” అన్నడు కిష్టయ్య.
“గీ ముచ్చట గాయన నోట్లెకేలి వచ్చింది కాదు. అమెరికోడు మనకు అప్పులిచ్చి తిప్పలు వెట్టనీకి, గిసొంటి ముఖ్యమంత్రుల్ని గద్దెమీదికి ఎక్కించి, ఎవుసం మీద గిసొంటి తిక్కమాటల్ని అనిపిస్తరు” ఒత్తి ఒత్తి చెప్పిండు ఆగమయ్య.
“లావ్ అన్ని చూసినట్టే మాట్లాడుతున్నవ్. నువ్వెప్పుడు గీ హోటల్ల పేపరే సూడవ్” అన్న మాట కిష్టయ్య నోట్లకేలి రాంగనే, పక్క బేంచి మీద కూసున్న లచ్చయ్య మధ్యకు జొర్రి..
“గీడనే ఉంటదా పేపరు. గా డిష్ సీను షాపులకు గుడ పేపరొస్తది. మన ఆగమయ్య రోజు ఆడనే ఎక్కువ కూసుంటడు. గక్కడనే వార్తలుగుడ టీవీల చూస్తనని నాకు మస్తుసార్లు చెప్పిండు” అన్నడు.
“ఎవరెట్లనన్న అనుకోని, ఏట్లకు పోని. మన బతుకంత ఎవుసం చుట్టే తిరుగుతది. యాడాదికి రెండు పంటల్ని ఏసుడు ఏసుడే.. ఎన్ని పైసలు తుట్టి రాని” అన్నడు ఆగమయ్య.
“ఎవరోయ్ ఈ జోర్దార్ మాటలంటున్నది” తాగుతున్న కరీం బీడీని పారేసి, హోటల్ రాజవ్వ మొగడు పెంటయ్య అన్నడు లోపటినించి.
“మన భూమయ్య కొడుకులేడా! ఆగమయ్య.. గాయిన్నే గీ మాటలంటున్నది” అని గడ్డమీద బాయున్న పోశయ్య అన్నడు.
“పంట వానకు తడిశిందని ఒగలేడుస్తుంటే.. బియ్యం నింపనీకి ఎన్ని బస్తాలు కావాల్నని అన్నడట! గట్లున్నది మీ ముచ్చట. మనకు ఎన్ని తక్లీఫులొచ్చినా ఎవుసం చేసుడాగదు. మల్ల గిట్లనే రాజవ్వ హోటల్ల ఒకల్లకొకలం మాటలు అనుకోకా తప్పదు” అని ఇరవై ఎకురాల ఆసామి మల్రెడ్డి అన్నడు.
సూర్యుడు ఆకాశం పొయ్యిమీద రొట్టెలెక్క మండుతున్నడు. రాజవ్వ గుడిసె హోటల్ల కట్టెల పొయ్యిమీద చాయి మసులుతనే ఉన్నది. వచ్చెటోల్లు వస్తున్నరు. పొయ్యెటోల్లు పోతున్నరు. పంచాయితీ ఆఫీసుకంటే ఎక్కువమంది, గీ హోటల్లనే కూడుతరు. గవి, గివ్వి అనుకుంట లోకంలున్న ముచ్చట్లన్నీ మాట్లాడుకుంటరు.
“ఓ పెంటయ్య బావ! వానకు హోటలు ఉరుస్తున్నది. ఇల్లెక్కి గా బెంగుళూరు గూనను సదిరి రాపో” అన్నది రాజవ్వ.
తాగుతున్న బర్కిలీ సిగరెట్ను కాళ్లకింద నలిపేసి, నిచ్చెనేసుకొని గూనను మంచిగ జరిపి కిందికి దిగిండు పెంటయ్య.
“రాజవ్వత్త! సమోసా గరముంటె సింగల్ ప్లేట్ పట్కరా” అన్నడు కిష్టయ్య భూమి కొన్న పక్కూరు పరమేశ్వర్ రెడ్డి.
ఇనుప కుర్చీ జరుపుకొని కుసోని, పేపరును మర్లేసుకుంట.. అండ్లున్న వార్తల్ని జర్రంత మెల్లగ మీదికే చదువుతున్నడు. హోటల్ మనుషులతోని నిండి, మత్తడి దుంకడానికి సిద్ధంగున్న చెరువులెక్కున్నది.
డాంబర్ రోడ్డుమీదున్న నీళ్లను చిత్తుకుంట కొత్త హీరోహోండా బండి రయ్యిన పోయింది. తొవ్వల నడుస్తున్న చింతకింది నర్సవ్వ మీద నీళ్లు పడ్డట్టున్నయ్. ఆమె శాపనార్థాలు పెడుతున్న మాటలు.. చిన్న మంగళారం సర్పంచ్ మొగిలయ్య చెవుల వడ్డట్టున్నయి.
“ఓ నర్సక్క! గట్ల తిట్టకు. ఇవాల్ల రేపు మాటలెవరు పడతలేరు. అంత మోరుదోపు కాలమున్నది” అన్నడు.
“నువ్వా మొగిలయ్య! ఎవల కొడుకు గా పోరడు నీకెర్కేనా?” అన్నది నర్సవ్వ.
“వాడా! సైడునుంచి చూస్తె మన ఆగమయ్య లేడు.. గాయ్న కొడుకు లెక్కనే కొట్టింది. నాయిన ఎవుసం భూములన్ని పిలాట్లు గొట్టి, మస్తు పైసలు కమాయిస్తె, కొడుకు బలాదూర్ తిరుగుళ్లు తిరుగుతున్నడు” అన్నడు మొగిలయ్య.
“నువ్వన్నది నువద్దెనే! ఆరేండ్ల కిందట ఆగమయ్య.. ఎవుసం చేసినప్పుడు మంచిగనే ఉండె. గీ భూముల రేట్లు పెరిగిన సంది గిట్ల తయారై, కొడుకును గుడా గిట్ల పెంచినట్టున్నది. అవ్.. మర్చిన! నా గుడ్డంలకు ఆగమయ్య సగంలకొచ్చిన పంచాది నీ కాడనే ఉన్నది కదా మొగిలయ్య” అన్నది నర్సవ్వ.
మొగిలయ్య గింతగుడా మాట్లాడలేదు.
“కాలానికి కత్తెర్లేసుడు మనతోనయ్యే పనేనా?” అని గ్యాస్నూనె స్టవ్ మీద సమోసాల్ని గోలిచ్చుకుంట అన్నది రాజవ్వ.
“జగ్గుతోని జరన్ని నీళ్లియ్యక్క.. కొంగుకు బురుదంటింది. కడుక్కుంట!” అన్నది నర్సవ్వ.
బురుదను కడుక్కొని, కొంగును పిండి..“రాజవ్వా! ఒక గరం చాయి ఇయ్యే!” అనుకుంట మొగిలయ్యకు ఎదురుంగ కూసున్నది. రోడ్డుమీద బండ్లు తిరుగుడు ఎక్కువైంది. కొత్త కొత్త బండ్లు. ఎన్నడు మొకమెరుగనోల్ల లెక్క గుడ్లప్పగిచ్చి చూస్తున్నరు హోటల్ల ఉన్నోల్లు.
గరం చాయి తాగి లేసుకుంట మొగిలయ్యతోని అన్నది నర్సవ్వ..
“ ఒక మంచి ముచ్చట చెప్త తమ్మి! బతుకుదేమున్నది ఇవ్వాల ఇంట్ల, రేపు మంట్ల అన్నట్టుంటది. పైసల్తోని కాలాన్ని మేపం. గీ ఆగమయ్య వాళ్ల నాయ్న భూమయ్య ఒక్కెకురం పొలం దున్నుకానికి ఎంత అరిగోస వడ్డడో నాకెరుకే! ఇయ్యాల్ల జరన్ని పైసలొచ్చి భూమిజాగల్ని బాగ పైసలకు అమ్ముకొని నీల్గుతుండొచ్చు. నాగలితోని భూమిని దున్ని, పండిచ్చిన పంటతోని కమాయించిన పైసలకే బర్కతుంటది. అడ్డగోలుగ భూమిని ముక్కలుజేసి సంపాంచిన పైసలకు రీతుండది రివాజుండది” అని కొంగును మళ్లొక్కసారి దులిపి, చాయె పైసలు ఇచ్చి పోయింది నర్సవ్వ.
జీవిత సత్యం చెప్పిన నర్సవ్వ దిక్కే మొకాలు పెట్టిండ్రు హోటల్ల ఉన్న అందరు. నర్సవ్వ మాటలు మొగిలయ్య కుడిచెవిలకు దూరి, ఎడమ చెవిలనుంచి జారి గాలిల కలిసిపొయినై. సూర్యుడు మబ్బుల గొంగడి కప్పుకొని పడమర దిక్కు నడుస్తుంటే, కొందరు వయసు పోరగాండ్లు బ్రాంది షాప్ల దిక్కు ఉరుకుతున్నరు.
నల్లతాసు లెక్క రోడ్డు చమ్కాయిస్తున్నది.
ఊరు భూకంపం వచ్చినట్టు ఊగిపోతున్నది. కార్లు డాంబర్ రోడ్డుమీద విచ్చలవిడిగ తిరుగుతున్నయ్. మూడంత్రాల బంగ్లాలు, నాలుగంత్రాల బంగ్లాలు గల్లిగల్లీల నిండ మొలిచి గమ్మతిగమ్మతి కొడుతున్నది.
స్పీడ్గా ఒక ఆడి కారొచ్చి, రెండంత్రాలున్న పంచాయితీ ఆఫీసు దగ్గర ఆగింది. అండ్లనుంచి కోటు బూటేసుకున్న ఒక మనిషి దిగి..
‘ఇక్కడ సర్పంచి ఇల్లెక్కడ’ అని ఎవరినో అడుగుతుంటే.. చెయ్యివెట్టి ఎవరో బడిపిల్లగాడు సందులున్న మూడంత్రాల బంగ్లాను చూపెట్టి, ఎప్పటి లెక్కనే హెడ్ఫోన్ చెవులల్ల పెట్టుకొని పాటెర్రిల పడిపోయిండు.
పెద్ద కార్లొచ్చినాయిన సర్పంచ్ ఇంట్లకుపొయ్యి కాలింగ్ బెల్ కొట్టిండు.
పట్టు చీరకట్టుకొని, పదితులాల బంగారం దిగేసుకున్న మొగిలయ్య భార్య బయటికొచ్చి..
“ఎవరుగావాలె?” అన్నది.
“మొగిలయ్య లేడా ఇంట్ల! ఎన్నిసార్లు కాల్ చేసినా స్విచ్ఆఫ్ వస్తున్నది” అన్నడు.
“నిన్న బొంగులూరుకాడ ఏదో జాగ సెటిల్మెంట్ ఉండెనట. దాబాలనే తినొచ్చేసరికి రాత్రి పన్నెండుగొట్టింది. ఫోన్ చార్జింగ్ పెట్టుడు మర్సినట్టున్నడు” అన్నదామె.
“ఇప్పుడు ఊర్ల దొరకడా” అన్నడు ఆడి కార్ల వచ్చిన పెద్ద మనిషి.
మొగిలయ్య భార్య నవ్వుకుంట.. “గీ టైంల ఊర్లెవరుంటున్నరు. అందరు గా ఇబ్రహీంపట్నం రిజిస్ట్రేషన్ ఆఫీసులకాడనే ఉండవట్రి. మా సర్పంచ్ సారుగుడా గాడనే దొరుకుతడు. జల్దిన పోండ్రి మల్లెటన్న పోగిట్ల దావత్లు గీవతులని” అని మొకం ముంగటనే తలుపేసుకున్నది.
ఇబ్రహీంపట్నం కళ కళలాడుతున్నది. రోడ్డు మధ్యల బటర్ఫ్లై లైట్లు ఊరు ఎవుసాన్ని రెండుగ చీల్చి, మస్తి ఉడాయించుకుంట వెలుతురు ఫోజు కొడుతున్నయి. కార్లొచ్చిన పెద్ద మనిషి, సర్పంచ్ మొగిలయ్యను దొరకవట్టుకొన్నడు. ఊర్ల, పట్నంల పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకున్న ఆగమయ్య, మొగిలయ్య, పెద్దమనిషితో కలిసి రిజిస్ట్రేషన్ ఆఫీసు దగ్గరున్న దాబాల కూర్చున్నరు.
“నువ్వెన్నన్న చెప్పు మొగిలయ్య మామా! గా జాగ గంత అగ్వల రాదే! రెండు కోట్లకు తక్కువైతె పడ్తల్ వడదే! నేనే ప్లాట్లు కొట్టి గజానికి పదివేల లెక్కన ఎన్ని అమ్మలేదు. గిప్పుడేమో ఆదిబట్ల కాడ సాఫ్టువేరు కంపెనీలు గుడా వస్తున్నయాయె! తక్కువ పైసలైతె బ్యారం కుదరదే! ఊర్ల ఒగలమొకం ఒగలం చూసుకునేటోల్లం” అని ముచ్చట ఖతం చేసిండు ఆగమయ్య.
ఆ పెద్దమనిషి రేటు పెంచుతలేడు. ఈ ఆగమయ్య దంగుతలేడు. బ్యారం కుదురుత లేదు.
మధ్యమధ్యల మొగిలయ్య ఫోన్ పట్కోని బయిటికి పోతున్నడు.. వస్తున్నడు. ఆగమయ్యకు కన్నుతోని ఏదో సైర జేస్తున్నడు. ఆగమయ్య ఫోన్లకు మెసేజ్ల మీద మెసేజులు వస్తున్నయ్. అవన్నీ ఫోన్ పట్కోని బైటికి పోయిన మొగిలయ్య పంపినవే!
“ఒరే ఆగమయ్య! సారుని కారెక్కించొస్త, గప్ చుప్ గ గీడనే కుసో! అటు ఇటు తిర్గకు. నీతోని మాట్లాడాలే” అని పెద్దసారుతోని బైటికి నడిచిండు మొగిలయ్య.
“సారు! మీరు ఇంటికైతే పోండి. నేను అంతా సెట్ చేసి రాత్రికి ఫోన్ చేస్తా. మావోడు గట్లనే జిద్దు చేస్తడు. వాని జుట్టు నా చేతులున్నది. మా ఊరి నర్సవ్వ జాగలకు కొంచెం జరిగిండు. గా గెట్టు పంచాది పదేండ్ల సంది నా కాడనే ఉన్నది. గీడ తొవ్వకు రాకపోతె గాడ ఒత్తుతా. మీరు నిమ్మళంగ కారెక్కిపొండి. గా జాగ మీదే అపోయిందనుకోండ్రి! రెండు కోట్లకు గాకపోతే మూడుకోట్లకైనా ఒప్పిస్త” అన్నడు మొగిలయ్య.
పెద్దమనిషి ఇంకేదో చెప్పవోతుంటే..
“మీరు చెప్పవోతున్నది నాకెరుకే! బంగారం గడ్డసొంటి జాగ సార్ అది. దాన్ని వదులుకోకుండ్రి ఒకటి దగ్గర” అని కారెక్కిచ్చిండు మొగిలయ్య.. గా పెద్ద మనిషిని.
చిన్న మంగళారం సర్పంచ్ ఇంటి గడియారం.. రాత్రి పది గంటలు గొట్టింది. మొగిలయ్య, ఆగమయ్య ఇద్దరు గూడి రాజవ్వ హోటల్ ముంగట కారాపి దిగిండ్రు.
రాజవ్వ గ్యాస్ స్టవ్ మీద చికెన్ మంచూర్యా చేస్తుంటే, ప్లాస్టిక్ కుర్చీలమీద కుసోని, మందు తాగుతున్న వాళ్లకు దాన్ని సప్లయి చేస్తున్నడు పెంటయ్య. హోటల్ నిండ రంగురంగుల ట్యూబులైట్లు అమర్చి ఉన్నయి. అది రెండంత్రాల చెత్తుపోసిన బంగ్లా. ఎవల కంటికి కనవడకుంట తాగెటోల్లకు స్పెషల్ రూం మీద గట్టిచ్చిండు పెంటయ్య.
కారు ఆగింది చూసిన రాజవ్వ..
“మొగిలయ్యన్న! పైన మిద్దెమీద రూము ఖాళీగనే ఉన్నది కూకోపొండ్రి. అన్ని పెంటయ్యతోని పంపుత” అన్నది.
ఇద్దరు మంచిగ కూసోని ఇబ్రహీంపట్నంల గొన్న విస్కీ బాటిల్ మూతదీసి రెండు గ్లాసులల్ల పోసుకున్నరు. సోడా మూత ఓపెన్ చేసి, మందు గ్లాసుల పోసుకుంట..
“మనమిద్దరం గల్సి ఊరవుతల ఉన్న రాజవ్వోల్ల గుడ్డాన్ని మంచి రేటుకు హైద్రాబాద్ పార్టీకి అమ్మెపటికే, గింతమంచి బిల్డింగ్ కట్టి, దాబా చేసింది. మనమే లేకుంటెనా గదే నల్ల మూకుడు మీద మిర్చి బజ్జీలేసుకుంట ఉండెటోల్లు” అని మొగిలయ్య చెబుతున్నడు.
అంతల్నే రాజవ్వ కొడుకు కిషోర్ ఫిష్ పకోడ ప్లేటుల తెచ్చి వాళ్ల ముంగట పెట్టిండు.
“ఇంకేమన్న అక్కెర ఉంటె పిలువుండ్రి అన్నా” అనుకుంట తంతెలు దిగిండు.
గ్లాసుల ఉన్న మందును ఎడమ చేతిల పట్టుకొని, మొగిలయ్యకు షేక్ హ్యాండ్ ఇచ్చి,
“మస్తుగ తింపినవే చక్రం. రెండు కోట్లుగూడా రావనుకున్న గా పొలానికి రెండున్నర ఇప్పిస్తున్నవ్. నీకు మంచి కమీషన్ ఇస్త. మల్ల తాపకు నిన్ను మండలాధ్యక్షున్ని చేస్త. తాగుతున్న గీ టీచర్స్ చాయిస్ మీద ఒట్టు. లేకుంటె మల్ల గీ ఎవుసం మీద బతికే కాలమా ఇది. కాగులు బియ్యంతోని కాదు.. నోట్ల కట్టలతోని నిండాలె” అనుకుంట సర్పంచ్ మొగిలయ్య గ్లాసుకు చీర్స్ కొట్టిండు ఆగమయ్య.
రాజవ్వ దాబాకు ఎదురుంగ చిన్న కల్లు దుకాణమున్నది. దాని ముంగట సీకులు అమ్ముతున్న నర్సవ్వ.. కుంపటిల బొగ్గులు మండుతున్నట్టు మండుతున్నది. కారు ఆగిన సంది అన్నీ గమనించుకుంటున్నది.
‘ఉన్న ఎకురం పొలంల సగానికి కబ్జాచేసి, ఇద్దరు గూడి ఎట్ల మందు తాగుతున్నరో!’ అనుకుంట మనసులనే తిట్టుకున్నది.
ఆకాశంలున్న సగం చంద్రుణ్ని చూస్తె.. నర్సవ్వ వెలిగించిన బొగ్గుల కుంపటిల కత్తిని నూరుతున్నట్టు ఉన్నది.. అప్పటి దృశ్యం!
వేముగంటి మురళీకృష్ణ స్వస్థలం సిద్దిపేట. 1972లో జన్మించారు. సిద్దిపేటలోనే డిగ్రీదాకా చదివారు. ప్రస్తుతం తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. తల్లిదండ్రులు వేముగంటి రంగనాయకమ్మ –
నరసింహాచారి. తండ్రి పద్య కవి. ఆయన నిర్వహించే కవి సమ్మేళనాలు, సమావేశాలకు మురళీ కృష్ణ కూడా హాజరయ్యేవారు. ఆయా కార్యక్రమాలకు ఉమ్మడి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే కవుల ద్వారా బాల్యంలోనే సాహిత్యాభిలాష పెంచు
కున్నారు. 1992 నుంచి మంజీర రచయితల సంఘం (మరసం)తో అనుబంధం పెంచుకున్నారు. 1994 నుంచి కవిత్వం రాయడం మొదలుపెట్టారు. ఇప్పటివరకూ 200కు పైగా కవితలు, 15 కథలు రాశారు. 2011లో ‘అలుకుబోనం’ పేరుతో కవితా సంపుటిని వెలువరించారు. ఈయన సంపాదకత్వంలో ‘జయశిఖరం’ కవిత్వ సంకలనం, ‘మునుం’ తెలంగాణ ఉద్యమం పుష్కర కవిత్వ సంకలనాలు వచ్చాయి. మెదక్ జిల్లా కథాసంపుటి ‘మెతుకు కతలు’కు సంపాదకత్వం చేపట్టారు. 2013 నుంచి చరిత్ర అధ్యయనం చేస్తున్నారు. తెలంగాణ జాగృతి సంస్థ త్వరలో వెలువరించనున్న ‘తెలంగాణ చరిత్ర’ సంపుటాలకు సంపాదకుడిగా పనిచేశారు. ‘ఒట్టిపోయిన కలలు’ కవితకు ‘రంజని కుందుర్తి’ పురస్కారం అందుకున్నారు. ఉపాధ్యాయ పత్రిక నిర్వహించిన కథల పోటీలో
‘జాతర’ కథకు బహుమతి దక్కింది.
“మస్తుగ తింపినవే చక్రం. రెండు కోట్లుగూడా రావనుకున్న గా పొలానికి రెండున్నర ఇప్పిస్తున్నవ్. నీకు మంచి కమీషన్ ఇస్త. మల్ల తాపకు నిన్ను మండలాధ్యక్షున్ని చేస్త. తాగుతున్న గీ టీచర్స్ చాయిస్ మీద ఒట్టు. లేకుంటె మల్ల గీ
ఎవుసం మీద బతికే కాలమా ఇది. కాగులు బియ్యంతోని కాదు.. నోట్ల కట్టలతోని నిండాలె” అనుకుంట సర్పంచ్ మొగిలయ్య గ్లాసుకు చీర్స్ కొట్టిండు ఆగమయ్య.
నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజా గ్రంథాలయం సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2020’లో ప్రచురణకు ఎంపికైన కథ.
-వేముగంటి మురళీకృష్ణ
9676598465