మోర్తాడ్, జూలై 31: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమవుతున్నది. ఏ పథకమైనా, ఏ రంగమైనా అదే నిర్లక్ష్య ధోరణి కనబరుస్తున్నది. రైతులు, మహిళలు, యువకులు, నిరుద్యోగులే కాదు.. పాఠశాలల విద్యార్థుల విషయంలోనూ మోసపూరిత వైఖరి కనబరుస్తున్నది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన దగ్గర అట్టిపెట్టుకున్న విద్యాశాఖలో అంతులేని నిర్లక్ష్యం తాండవిస్తున్నది. సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు ఇప్పటికీ యూనిఫామ్లు అందలేదు. పాఠశాలలు ప్రారంభమై రెండు నెలలు సమీపిస్తున్నా ఆ ఊసే లేదు. పంద్రాగస్టు లోపు యూనిఫామ్లు అందిస్తామని ఘనంగా ప్రకటించిన ప్రభుత్వం.. ఆ దిశగా ఒక్క అడుగు కూడా వేయకపోవడంతో గడువులోపు దుస్తులు అందుతాయా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఈవిద్యాసంవత్సరం యూనిఫామ్ కలర్, ప్యాటర్న్లను ప్రభుత్వం మార్చిం ది. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఉండాలన్న ఉద్దేశంతో రంగు మార్చినట్లు ప్రచారం జరుగుతున్నది. ప్రస్తుతం బ్లూ కలర్ను ఎంపిక చేశారు. బాలురకు సంబంధించి రెండు డిజై న్లు, బాలికలకు సంబంధించిన మూడు డిజైన్లలో యూనిఫామ్లను రూపొందించారు. ప్రభుత్వం వీలైనంత త్వరగా వస్ర్తాలను పంపించి, కుట్టించి విద్యార్థులకు అందేలా చూడాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు.
విద్యార్థుల యూనిఫామ్లకు సంబంధించి రావాల్సిన వస్త్రం ఇప్పటివరకు రాలేదు. అవి ఎప్పుడు వస్తాయో, వాటిని కుట్టడం ఎప్పుడు పూర్తవుతుందో, విద్యార్థులకు ఎప్పుడు ఇస్తారో అన్నది అంతు చిక్కని ప్రశ్నగా మారింది. ప్రభుత్వం వస్ర్తాన్ని మండలాలకు పంపిస్తే, దాన్ని మహిళా సంఘాలకు అందజేస్తారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో యూనిఫామ్లను కుట్టించి, వాటిని పాఠశాలలకు అందజేస్తారు.
అయితే, మహిళాసంఘాలకు ఇప్పటి వరకు వస్ర్తాలే అందివ్వక పోవడం, వాటిని ఇచ్చేదెప్పుడు.. యూనిఫామ్లు కుట్టేదెప్పుడు? అని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. గతేడాది కాస్త అటు ఇటైనా యూనిఫామ్లను పంపిణీ చేశారు. అయితే, ఈసారి మాత్రం బాగా ఆలస్యమయ్యేలా కనిపిస్తున్నది. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలోని 1,163 ప్రభుత్వ పాఠశాలల్లో 1,00, 121 మంది చదువుతున్నారు. వీరి యూనిఫామ్లకు సంబంధించిన వస్ర్తాలను మండలాల వారీగా అందివ్వడం, దుస్తులు కుట్టించడం, తరువాత పంపిణీ చేయడం ఎప్పుడు పూర్తవుతుందన్న అంతు చిక్కని ప్రశ్నగా మారింది.