హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో రోజురోజుకు విద్యార్థుల హాజరు శాతం పెరుగుతూ వస్తుంది. ఆయా పాఠశాలల్లో కొవిడ్ నిబంధనలను పాటిస్తూ విద్యార్థుల ఆరోగ్యం పట్ల సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు సైతం తమ బిడ్డలను బడులకు పంపించేందుకు ఆసక్తి చూపుతున్నారు.
అయితే 4వ రోజు పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం స్వల్పంగా పెరిగింది. నిన్నటి కంటే 2 శాతం అదనంగా విద్యార్థులు హాజరయ్యారు. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా 32.15 శాతం హాజరు నమోదైంది. ప్రభుత్వ పాఠశాలల్లో 46.05 శాతం విద్యార్థులు హాజరయ్యారు. ఎయిడెడ్ పాఠశాలల్లో 22.55 శాతం నమోదు కాగా.. ప్రైవేట్ పాఠశాలల్లో 23.64 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు అధికారులు వెల్లడించారు.