ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీలో స్పోర్ట్స్ క్లస్టర్ ప్రారంభించేందుకు వచ్చిన కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని అడ్డుకునేందుకు విద్యార్థి నేతలు ప్రయత్నించారు. కేంద్ర ఫెలోషిప్లు పొందేందుకు నెట్ అర్హతను తప్పనిసరి చేస్తూ విధించిన నిబంధనను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ ఎంఎస్ఎఫ్ – టీఎస్ ఆధ్వర్యంలో కిషన్రెడ్డిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు వెంటనే విద్యార్థి నేతలను అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా విద్యార్థి నాయకుడు నాగరాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ దళిత విద్యార్థి వ్యతిరేక విధానాల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చి, గద్దెనెక్కాక దానిని పక్కనపెట్టిందని మండిపడ్డారు. ఎస్సీ పరిశోధక విద్యార్థులకు కేంద్ర ఫెలోషిప్లు పొందేందుకు నేషనల్ లెవల్ ఎలిజిబిలిటీ టెస్ట్లో అర్హత సాధించడం తప్పనిసరి అనే నిబంధనను రూపొందించి, దళిత విద్యార్థులను పరిశోధనలకు దూరం చేశారని దుయ్యబట్టారు.
ఇప్పుడిప్పుడే విశ్వవిద్యాలయాలకు వస్తున్న ఎస్సీ విద్యార్థులకు పరిశోధనల వైపు వెళ్లేందుకు ఇది అడ్డంకిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కిషన్రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఈ నిబంధనను తొలగింపజేయాలని కోరారు. లేనిపక్షంలో కేంద్రమంత్రులను అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు.