Huzurabad MLA Padi Kaushik Reddy | వీణవంక, జూలై 10 : ప్రజల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. వీణవంక మండలంలోని చల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సరైన సౌకర్యాలు లేవని, సిబ్బంది లేరని ఎమ్మెల్యేకు పలువురు ఫిర్యాదులు చేశారు. దీంతో కౌశిక్ రెడ్డి స్థానిక నాయకులతో కలసి పీహెచ్సీని శుక్రవారం తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ఓపీ రిజిస్టర్, మెడికల్ షాపు, ల్యాబ్ తదితర విభాగాలను పరిశీలించి, డాక్టర్ సంతోష్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ పీహెచ్సీలో అరకొర సిబ్బందితో పూర్తి స్థాయిలో వైద్యం అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. మండలంలోని చల్లూరు గ్రామస్తులు పీహెచ్సీలో ప్రజలకు సరైన వైద్యం అందడంలేదని ఫిర్యాదు చేశారని తెలిపారు.
ఆసుపత్రికి మొత్తం 12 మంది సిబ్బంది మంజూరై ఉన్నప్పటికీ వారిలో ఆరుగురు డిప్యుటేషన్పై ఆయా ఆసుపత్రుల్లో విధులు నిర్వహిస్తున్నారని, చల్లూరులో మాత్రం ఒక్క వైద్యాధికారి, అరకొర సిబ్బందితో ఆసుపత్రి నిర్వహణ జరుగుతుండటంతో ప్రజలకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందడం లేదని ఆవేదన వ్యక్తిం చేశారు. చల్లూరు పీహెచ్సీ ప్రజలకు ఉత్తమ వైద్య సేవలు అందించి, ప్రసవాలలో విశేష ప్రతిభ కనబరిచి మూడు సార్లు అవార్డసాధించిందని గుర్తు చేశారు. అలాంటి ఆసుపత్రి నేడు నిర్లక్ష్యానికి గురికావడం బాధాకరమని, ప్రస్తుతం అందుతున్న వైద్య సేవలపై అనేక ఫిర్యాదులు అందుతున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో వెంకటరమణతో ఫోన్లో మాట్లాడుతూ డిప్యుటేషన్పై వెళ్లిన సిబ్బందిని వెంటనే విధుల్లోకి తీసుకురావాలని, ఆసుపత్రిలో పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు.
వారం రోజుల్లో మరోసారి ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శిస్తానని, ఆలోగా ఆసుపత్రి నిర్వహణ, సిబ్బంది హాజరు, పరిశుభ్రత, రోగులకు అందించే వైద్య సేవలు మెరుగ్గా ఉండాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు ఎక్కువగా పేద, నిరుపేద కుటుంబాల ప్రజలే వస్తారని, వారికి సకాలంలో వైద్య సేవలు అందించాలని, ప్రజల ఆరోగ్యంపట్ల నిర్లక్ష్యం వహిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వాల బాలకిషన్రావు, మాజీ ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, సర్పంచ్ సంపత్రెడ్డి, ఉపసర్పంచ్ ఫసియొద్దీన్, వార్డు సభ్యులు, నాయకులు జక్కు నారాయణ, పొదిల రమేష్, స్వామి, పుల్లారెడ్డి, తాండ్ర శంకర్, సదానందం, తదితరులు పాల్గొన్నారు.