ఢాకా: బంగ్లాదేశ్లో మతాన్ని వాడుకొని హింసకు పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ దేశ ప్రధాని షేక్ హసీనా ఆదేశించారు. దేశంలో పలుచోట్ల హిందూ ఆలయాలు, హిందువులపై దాడులు, వారి ఇండ్లు తగులబెట్టడం, ధ్వంసం చేయడం వంటి ఘటనలపై మంగళవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఆమె సమీక్షించారు. దౌర్జన్యకారులను ఉపేక్షించవద్దని హోంమంత్రి అసదుజ్జమన్ ఖాన్కు సూచించారు. నిజానిజాలు తెలుసుకోకుండా సామాజిక మాధ్యమాల్లో పోస్టులను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హిందువులు భయపడవద్దని, వారికి అండగా ఉంటామని అధికార ఆవామీ లీగ్ పేర్కొన్నది.